క్షయ నివారణ అందరి బాధ్యత
జగిత్యాల: క్షయ నివారణ ప్రతీ ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి శ్రీధర్ అన్నారు. శుక్రవారం మోతెవాడలో నిక్షయ్ దివస్ కార్యక్రమంలో భాగంగా క్షయవ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, దగ్గు, జ్వరం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాల్లో ఉచిత నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
క్షయ నిర్ధారణ జరిగితే ఉచితంగా ఆరు మాసాల పాటు మందులు అందించడంతోపాటు ప్రతినెలా పోషణ భత్యం కింద రూ.500 అందిస్తామని అన్నారు. క్షయవ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా మాస్క్లు ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్, వైద్యురాలు గీతిక, సూపర్వైజర్ శ్రీనివాస్, మహేశ్, రూప, సృజన్ తదితరులు పాల్గొన్నారు.