కరోనా గుట్టు.. చైనా మెడకు బిగుస్తున్న ఉచ్చు! | Wuhan Lab Staff Hospitalised Before Corona Outbreak | Sakshi
Sakshi News home page

కరోనా గుట్టు.. చైనా మెడకు బిగుస్తున్న ఉచ్చు!

May 24 2021 11:39 AM | Updated on May 24 2021 11:49 AM

Wuhan Lab Staff Hospitalised Before Corona Outbreak  - Sakshi

వెబ్‌డెస్క్‌: కరోనా వైరస్‌ చైనాలోనే పుట్టిందన్న ఆరోపణలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ తరుణంలో చైనా చుట్టూ గట్టి ఉచ్చు బిగించాలని అమెరికా ప్రయత్నిస్తోంది. సార్స్-సీవోవీ-2 వైరస్  కారకం వుహాన్‌ ల్యాబ్‌లోనే పుట్టిందనే అనుమానాల్ని బలపరిచేలా మరో కీలక ఆధారాన్ని డబ్ల్యూహెచ్‌వో ప్యానెల్‌ ముందు అమెరికా ఉంచిది. 

కరోనా విజృంభణ మొదలుకాక ముందు..  నవంబర్‌ 2019లో వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలో పనిచేసే ముగ్గురు పరిశోధకులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో వాళ్లను ఆస్పత్రిలో చేర్పించారు. అయితే వాళ్లు ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నవిషయాన్ని చాలా గోప్యంగా ఉంచింది ల్యాబ్‌. అంతేకాదు ఆ ఆస్పత్రి  బయట గట్టి కాపలా ఉంచింది. అమెరికన్‌ నిఘా వర్గాలు ఈ వివరాలతో సమగ్రంగా ఒక రిపోర్ట్‌ తయారు చేశాయి. తాజాగా డబ్ల్యూహెచ్‌వో డెషిషన్‌ మేకింగ్‌ బాడీ మీటింగ్‌లో ఈ రిపోర్ట్‌ ప్రస్తావనకు వచ్చింది. దీంతో కరోనా పుట్టుక గురించి జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ రిపోర్ట్‌ను ప్రధానంగా పరిశీలించాలని డబ్ల్యూహెచ్‌వో ప్యానెల్‌ డిసైడ్‌ నిర్ణయించుకుంది. ఈ విషయాల్ని ప్రముఖ అమెరికన్‌ పత్రిక వాషింగ్టన్‌ డీసీ ప్రచురించింది.  

అమెరికా అతిచేస్తోంది
వుహాన్‌ ల్యాబ్‌ సిబ్బంది ముగ్గురూ కోవిడ్‌19 లక్షణాలతో పాటు సీజనల్‌ జబ్బులతో ఆస్పత్రుల్లో చేరారని అమెరికన్‌ ఇంటెలిజెన్సీ రిపోర్ట్‌ పేర్కొంది. అయితే వాళ్లు ఆస్పత్రుల్లో చేరిన సమయం, చికిత్సను గోప్యంగా ఉంచడం, కొన్నాళ్లకే కరోనా విజృంభించడం.. ఈ అనుమానాలన్నీ ‘కరోనా వైరస్‌ వుహాన్‌ ల్యాబ్‌’ సృష్టే అనే వాదనను బలపరుస్తున్నాయని తెలిపింది. చైనా మాత్రం అమెరికా ఆరోపణలను మొదటి నుంచే ఖండిస్తోంది. ‘అమెరికా అతిచేస్తోందని, ఈ ఆరోపణలు దర్యాప్తును పక్కదారి పట్టించేలా ఉన్నాయ’ని విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు కరోనా తమ భూభాగంలో పుట్టలేదని, మేరీల్యాండ్‌లో ఫోర్ట్‌ డెట్రిక్‌ మిలిటరీ బేస్‌ మీదే తమకు అనుమానాలు ఉన్నాయని చైనా ఇది వరకే డబ్ల్యూహెచ్‌వోకి ఒక రిపోర్ట్‌ అందజేసింది కూడా. అయితే వుహాన్‌ ల్యాబ్‌ రీసెర్చర్ల ట్రీట్‌మెంట్‌ గురించి ట్రంప్‌ హయాంలోనే రిపోర్ట్‌ తయారైనప్పటికీ.. బైడెన్‌ కార్యాలయం మాత్రం ఈ ఇష్యూపై స్పందించట్లేదు. 

శాంపిల్స్‌ ఇవ్వట్లేదు
శరదృతువు (సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ నెలల మధ్య) కాలంలో వుహాన్‌ రీసెర్చలు సీజనల్‌ జబ్బులు పడడం సర్వసాధారణమని డచ్‌ వైరాలజిస్ట్‌ మరియోన్‌ చెబుతోంది. ఆ ముగ్గురు కొవిడ్‌ లక్షణాలతోనే చేరారా? అనేది అనుమానం మాత్రమే అని ఆమె ఆంటోంది. ఇక 2019 అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ మధ్య డెబ్భై ఆరువేల మంది సీజనల్‌ జబ్బుల బారినపడ్డారు. వాళ్లలో యాంటీ బాడీస్‌ కోసం 92 మందిని మాత్రమే చైనా పరీక్షించింది. ఈ విషయం డబ్ల్యూహెచ్‌వో దృష్టికి రావడంతో వాళ్ల రిపోర్ట్‌లు కోరింది. అయితే గోప్యతను సాకుగా చూపెడుతూ చైనా అందుకు నిరాకరించింది. ఇక వుహాన్‌ ల్యాబ్‌ బ్లడ్‌ బ్యాంక్‌ రిపోర్ట్‌లను సైతం ఇచ్చేందుకు చైనా మొదట అంగీకరించకపోగా.. డబ్ల్యూహెచ్‌వో ఒత్తిడితో దిగొచ్చింది. కానీ, ఇప్పటిదాకా ఎలాంటి రిపోర్టులు సమర్పించలేదని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement