అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇజ్రాయెల్కు సుమారు 2,000 పౌండ్ల (907 కిలోల) బరువున్న 60 వేల భారీ బాంబులను విక్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. దాదాపు 2.8 బిలియన్ డాలర్ల విలువైన ఈ ఆయుధ ప్యాకేజీకి అమెరికా పన్ను చెల్లింపుదారుల నిధులు కూడా ఉపయోగించనున్నట్లు సమాచారం. అయితే ఈ విక్రయాన్ని అమెరికా ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించలేదు.
ఈ ప్యాకేజీలో 20 వేల ఎంకే-84, 20 వేల బీఎల్యూ-117, 20 వేల ఐ-2000 పెనిట్రేటర్ బాంబులు ఉండనున్నట్లు సమాచారం. వీటిలో ఎంకే-84, బీఎల్యూ-117లు 2,000 పౌండ్ల సాధారణ బాంబులు కాగా, ఐ-2000ను బంకర్ బస్టర్గా పిలుస్తారు. గట్టి నిర్మాణాలను ఛేదించి లోపల పేలేలా దీన్ని రూపొందించారు.
ఈ ప్రతిపాదిత విక్రయం నేపథ్యంలో అమెరికా ఆయుధ నిల్వలపై కూడా చర్చ మొదలైంది. ఇరాన్తో యుద్ధం కారణంగా అమెరికా ఆయుధ నిల్వలు తగ్గుతున్నాయని, సరఫరా వ్యవస్థలో కొన్ని అవరోధాలు ఏర్పడుతున్నాయని సోమవారం విడుదలైన పెంటగాన్ పర్యవేక్షణ నివేదిక పేర్కొన్నట్లు అల్జజీరా తెలిపింది. 2024లో జో బైడెన్ ప్రభుత్వం ఇజ్రాయెల్కు కొన్ని 2,000 పౌండ్ల బాంబుల సరఫరాను నిలిపివేసింది.
అనంతరం ట్రంప్ అధ్యక్షుడిగా తిరిగి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ నిర్ణయాన్ని రద్దు చేశారు. గతంలోనూ ఇజ్రాయెల్కు భారీ బాంబుల సరఫరాపై అమెరికాలో రాజకీయ నేతల నుంచి భిన్నమైన స్పందనలు వచ్చాయి. ఇక ఈ కొత్త ఆయుధ ప్యాకేజీ అధికారికంగా ఆమోదం పొందుతుందా, కాంగ్రెస్కు ఎప్పుడు అధికారికంగా తెలియజేస్తారు, ఇజ్రాయెల్కు ఆయుధాల సరఫరాపై అమెరికా విధానం ఎలా మారుతుంది? అనేది కీలకంగా మారింది.


