ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతంలో ప్రయాణికుల బస్సుపై రష్యా డ్రోన్ దాడి చేయడంతో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నికోపోల్ నగరం వద్ద బుధవారం తెల్లవారుజామున ఈ దాడి జరిగినట్లు వెల్లడించారు. మరో ఏడుగురు గాయపడ్డారని ద్నిప్రొపెట్రోవ్స్క్ ప్రాంత గవర్నర్ ఒలెక్సాండర్ హాంజా తెలిపారు.
దాడికి గురైన బస్సు కిటికీలు ధ్వంసమైన దృశ్యాలను ప్రాంతీయ గవర్నర్ టెలిగ్రామ్లో పోస్ట్ చేశారు. బస్సు వెలుపల రక్తం కారుతున్నట్లు కనిపించిన ఫొటోను కూడా ఆయన పంచుకున్నారు. అయితే ఆ చిత్రాన్ని అంతర్జాతీయ మీడియా ఇంకా ధ్రువీకరించలేదు. ఈ దాడిపై రష్యా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. యుద్ధంలో పౌరులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంటున్నారన్న ఆరోపణలను రష్యా, ఉక్రెయిన్ రెండూ ఖండిస్తున్నాయి.
రైళ్లపైనా దాడులు
ఇదే సమయంలో ఉక్రెయిన్లోని మైకోలైవ్ ప్రాంతంలో ప్రయాణికుల రైలుపైనా రష్యా డ్రోన్ దాడి జరిగినట్లు తాత్కాలిక ప్రాంతీయ గవర్నర్ హెఓర్హీ రెషెటిలోవ్ తెలిపారు. రైలులో ఉన్న మొత్తం 168 మంది ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తరలించినట్లు, ఎవరూ గాయపడలేదని ఆయన చెప్పారు. తొలి దాడి తర్వాత రైలుపై మరో రెండు సార్లు దాడి జరిగినట్లు తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ ప్రకారం, పోలాండ్ సరిహద్దుకు సమీపంలోని కోవెల్లో ఓ రైలు ఇంజిన్పైనా దాడి జరిగింది.
ఉక్రెయిన్ గగనతలం 2022లో రష్యా పూర్తిస్థాయి దాడి ప్రారంభించినప్పటి నుంచి మూసివేయడంతో, దేశంలో సాధారణ ప్రజలు, వ్యాపారాలకు బస్సులు, రైళ్లు కీలక రవాణా మార్గాలుగా మారాయి. ఇటీవలి నెలల్లో రష్యా, ఉక్రెయిన్ పరస్పరం రవాణా వ్యవస్థలు, మౌలిక వసతులపై దాడులను పెంచాయి. ఉక్రెయిన్ రైల్వే సంస్థ ప్రకారం, ఈ ఏడాది ఇప్పటివరకు 120 ప్రయాణికుల బోగీలు, 304 రైలు ఇంజిన్లు, 43 రైల్వే స్టేషన్లు దెబ్బతిన్నాయి. మొత్తం 1,700 రైల్వే సదుపాయాలపై దాడులు జరిగినట్లు సంస్థ తెలిపింది.
ఈ దాడుల నేపథ్యంలో రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని జెలెన్స్కీ అమెరికా, ఐరోపా దేశాలను కోరారు. రాబోయే రోజుల్లో రవాణా వ్యవస్థలపై దాడులు, పౌరుల భద్రత, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో పాశ్చాత్య దేశాల తదుపరి చర్యలు కీలకంగా మారనున్నాయి.


