అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి డెమోక్రట్లు అత్యంత ప్రమాదకరమని.. తనపై జరిగిన హత్యాయత్నానికి ఒకరకంగా వాళ్లే కారణమని ఆరోపించారు. ఈ క్రమంలో మీడియాపైనా ఆయన చిందులు తొక్కారు.
‘‘నేరాల విషయంలో మీడియా, డెమోక్రట్లు ఒకేలా ఉన్నాయి. నేను మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నా. నో కింగ్స్ ఆందోళనలో పాల్గొన్న వ్యక్తే నాపై హత్యాయత్నం చేశాడు. నేరస్తుడు వైడ్ అవేక్స్ అనే టీంలో సభ్యుడిగా ఉన్నాడు. నో కింగ్స్ నిరసనలకు కొందరు కుట్రదారులు ఫండింగ్ చేశారు. రాజుల్లేరు.. నేను రాజును కాదు. నేనే గనుక రాజును అయితే సీన్ వేరేలా ఉండేది’’ అని అన్నారాయన. సీబీఎస్ ‘60 నిమిషాలు’ కార్యక్రమంలో జరిగిన ఇంటర్వ్యూలో ట్రంప్ పై వ్యాఖ్యలు చేశారు.
తనపై జరిగిన హత్యాయత్నం గురించి స్పందిస్తూ.. అమెరికా అధ్యక్షులపై హత్యాయత్నం కొత్తేం కాదు. అది ఎప్పుడూ జరిగేదే. గతంలో గతంలో అబ్రహం లింకన్, మెక్ కిన్లే, కెనెడీలపైనా జరిగాయి. డెమోక్రట్ల విషపూరిత ప్రసంగాల వల్లే ఇలా జరుగుతోంది. వాళ్లు అమెరికాకు అత్యంత ప్రమాదకరం’’ అని అన్నారాయన.
అదే సమయంలో కాల్పులకు దిగిన నిందితుడు కోలో టోమస్ ఎలెన్ చేసిన సంచలన ఆరోపణలను సీబీఎస్ ప్రతినిధి నోరా ఓడోనెల్ ప్రస్తావించారు. అయితే.. ‘‘నేను రేపిస్ట్ను కాదు’’ అంటూ ట్రంప్ ఆమెపై ఆయన ఫైర్ అయ్యారు.


