ఇవాళ జరిగిన కాంగ్రెస్ (పార్లమెంట్) సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్ధి పార్టీ (డెమోక్రాట్లు) సభ్యులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. విమానాశ్రయ భద్రతకు అవసరమైన నిధులను వెంటనే ఆమోదించకపోతే ICE (Immigration and Customs Enforcement) సిబ్బందిని దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో నియమిస్తానని హెచ్చరించారు.
ICE ఏజెంట్లు గతంలో ఎన్నడూ చూడని విధంగా భద్రతా తనిఖీలు చేపట్టి, అక్రమ వలసదారుల అరెస్టు చేస్తారని అన్నారు. ముఖ్యంగా సోమాలియా వలసదారులను లక్ష్యంగా చేసుకుంటారని తెలిపారు. వారు మిన్నెసోటా రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపిస్తూ, స్థానిక డెమోక్రాట్ నాయకులపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఇల్హాన్ ఒమర్ అనే మహిళా సభ్యురాలిని అవినీతిపరురాలిగా ఆరోపించారు.
ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అమెరికా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. సాధారణంగా విమానాశ్రయ భద్రత Transportation Security Administration (TSA) పరిధిలో ఉంటుంది. అయితే ICE ఏజెంట్లను అక్కడికి పంపడం అనేది అసాధారణ చర్య.
ICE ఏజెంట్లు ఇమిగ్రేషన్ అమలు, సరిహద్దు భద్రత, అక్రమ వలసదారుల నియంత్రణ వంటి పనుల్లో ఉంటారు. TSA స్థానంలో ICE ఏజెంట్లు భద్రతా తనిఖీలు చేపడితే ప్రయాణికుల అనుభవం పూర్తిగా మారవచ్చు.
కాగా, కాంగ్రెస్లో విమానాశ్రయ భద్రతా నిధులపై డెమోక్రాట్లు, రిపబ్లికన్ల (ట్రంప్ పార్టీ) మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ట్రంప్ తాజా హెచ్చరికను డెమోక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది.


