S Jaishankar: వివాదాలకు చర్చలే శరణ్యం | S Jaishankar: Agreements between nations must be respected | Sakshi
Sakshi News home page

S Jaishankar: వివాదాలకు చర్చలే శరణ్యం

Oct 25 2024 4:09 AM | Updated on Oct 25 2024 4:11 AM

S Jaishankar: Agreements between nations must be respected

బ్రిక్స్‌ సదస్సులో భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ వెల్లడి  

అంతర్జాతీయ చట్టాలకు ఎవరైనా సరే లోబడి ఉండాల్సిందే  

ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలన్నీ కఠిన వైఖరి అవలంబించాలి  

కజన్‌: వివాదాలు, విభేదాలను చర్చలు, దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాల్సిందేనని భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ పునరుద్ఘాటించారు. యుద్ధాలతో సాధించేదీ ఏమీ ఉండదని తేల్చిచెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొనసాగుతున్న సంఘర్షణలు, ఉద్రిక్తతలు చల్లారాలంటే చర్చలపై తక్షణమే దృష్టి పెట్టాలని సూచించారు. రష్యాలోని కజన్‌ నగరంలో బ్రిక్స్‌ ఔట్‌రీచ్‌/బ్రిక్స్‌ ప్లస్‌ సదస్సులో చివరి రోజు గురువారం జైశంకర్‌ మాట్లాడారు. ఇది యుద్ధాల శకం కాదంటూ భారత ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. 

శాంతియుత చర్చలు, దౌత్య మార్గాలపై దృష్టి పెడితే వివాదాలు సమసిపోతాయని పేర్కొన్నారు. దేశాల మధ్య ఒప్పందాలు కుదిరినప్పుడు వాటిని తప్పనిసరిగా గౌరవించాలని అన్నారు. అంతర్జాతీయ చట్టాలకు ఎవరైనా సరే లోబడి ఉండాలని, ఎలాంటి మినహాయింపులు ఉండొద్దని తేల్చిచెప్పారు. ప్రపంచానికి ముప్పుగా మారిన ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబించాలని సూచించారు. పశి్చమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై జైశంకర్‌ ఆందోళన వ్యక్తంచేశారు. దీర్ఘకాలపు సవాళ్లను ఎదిరించే విషయంలో కొత్తగా ఆలోచించడానికి ప్రపంచం సిద్ధంగా ఉండాలని చెప్పారు.   

ఐరాస భద్రతా మండలిని సంస్కరించాల్సిందే  
ప్రపంచీకరణ ప్రయోజనాలు అందరికీ సమానంగా అందడం లేదని, ఈ నిజాన్ని బ్రిక్స్‌ వేదిక గుర్తించాలని జైశంకర్‌ కోరారు. కోవిడ్‌ మహమ్మారితోపాటు వేర్వేరు సంఘర్షణల కారణంగా గ్లోబల్‌ సౌత్‌ దేశాలపై భారం మరింత పెరిగిందన్నారు. వైద్యం, ఆహారం, ఇంధన భద్రత విషయంలో ప్రతికూల ప్రభావం పడిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ‘సరిసమానమైన ప్రపంచ క్రమం’ అవసరమని అభిప్రాయపడ్డారు. మౌలిక సదుపాయాల విషయంలో వివిధ దేశాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని, ఇవి వలసవాద పాలన నుంచి వారసత్వంగా వచ్చాయని పేర్కొన్నారు. ఈ వ్యత్యాసాలను సరి చేయాలన్నారు. 

సరుకుల సరఫరా కోసం దేశాల మధ్య అనుసంధానం మరింత పెరగాలన్నారు. ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రతను, సార్వ¿ౌమత్వాన్ని గౌరవిస్తూ ఆ దిశగా అన్ని దేశాలూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచస్థాయి సంస్థలు, అభివృద్ధి బ్యాంకుల్లో సంస్కరణలు తక్షణావసరమని జైశంకర్‌ తెలిపారు. ముఖ్యమంత్రి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు వెంటనే ప్రారంభించాలని అన్నారు. భద్రతా మండలిలో మరికొన్ని దేశాలకు శాశ్వత సభ్యత్వం కలి్పంచాలని డిమాండ్‌ చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆతిథ్యం ఇచ్చిన బ్రిక్స్‌∙సదస్సుకు పదికిపైగా బ్రిక్స్‌ సభ్యదేశాలతోపాటు దాదాపు 40 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement