యుద్ధం వేళ ఇరాన్‌ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్‌ | PM Modi speaks to Iranian President | Sakshi
Sakshi News home page

యుద్ధం వేళ ఇరాన్‌ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్‌

Mar 21 2026 4:29 PM | Updated on Mar 21 2026 5:01 PM

PM Modi speaks to Iranian President

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం వేళ ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ చేశారు. ఈద్, నౌరూజ్‌ శుభాకాంక్షలు తెలిపారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్‌ అధ్యక్షుడికి మోదీ ఫోన్‌ చేయడం ఇది రెండో సారి. పశ్చిమాసియాలో పరిస్థితులపై చర్చించారు. 

పశ్చిమాసియాలో కీలక మౌలిక వసతులపై జరిగిన దాడులను ఖండించారు. అవి ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీసి, ప్రపంచ సరఫరా గొలుసులకు ఆటంకాలు కలగజేస్తాయని అన్నారు. ఈద్‌ పశ్చిమ ఆసియాకు శాంతి, స్థిరత్వం, సమృద్ధి తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు, ఇరాన్‌, అమెరికా-ఇజ్రాయెల్‌ దాడులు, ప్రతిదాడులను మరింత తీవ్రం చేసుకుంటూ పోతున్నాయి. ఈ వారం ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తీవ్రత మరింతగా పెరుగుతుందని రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ సైనిక అధికారులతో సమీక్ష సమయంలో చెప్పారు.

టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పత్రిక తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్ ఉగ్ర పాలనపై ముందుండి దాడులను కొనసాగించేందుకు ఇజ్రాయెల్‌ కట్టుబడి ఉందని కాట్జ్ తెలిపారు. ఇజ్రాయెల్ భద్రతకు, అలాగే అమెరికా ప్రయోజనాలకు పశ్చిమాసియాలో ఉన్న ప్రతి ముప్పును తొలగించే వరకు ఆగబోమని అన్నారు. యుద్ధ లక్ష్యాలన్నీ సాధించే వరకు తాము ఆగబోమని ఆయన పేర్కొన్నారు.

ఇరాన్‌, అమెరికా-ఇజ్రాయెల్‌ ఏ మాత్రం వెనక్కు తగ్గకపోతుండడంతో ఆందోళన రోజురోజుకీ పెరుగుతోంది. చమురు, గ్యాస్‌ నిక్షేలపై ఆయా దేశాలు దాడులు చేస్తుండడంతో చమురు ధరలు పెరిగిపోతున్నాయి. దీంతో దాడులు ఆపాలని, చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని అనేక దేశాలు కోరుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement