ఉత్తర్వు జారీ చేసిన కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ: పశ్చిమాసియా పరిణామాల వల్ల మన దేశంలో వంట గ్యాస్ కొరత వేధిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ) అందుబాటులో ఉన్నచోట వినియోగదారులు తప్పనిసరిగా ఆ కనెక్షన్ తీసుకోవాలని, లేకపోతే ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ తొలగిస్తామని తేల్చిచెప్పింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వు జారీ చేసింది. ప్రస్తుత పరిణామాలతోపాటు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని గ్యాస్ నెట్వర్క్ను విస్తరించడం, ఎల్పీజీపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడం ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోంది.
గృహ, వాణిజ్య వినియోగదారులు పైపుల ద్వారా సరఫరా అయ్యే సహజ వాయువును విస్తృతంగా ఉపయోగించుకోవాలని సూచిస్తోంది. పీఎన్జీ దేశీయంగానే ఉత్పత్తి అవుతోంది. ఇది వైవిధ్యభరితమైన సరఫరా మార్గాల ద్వారా లభించే సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయం. పైప్లైన్ ద్వారా వంటగదికి పీఎన్జీని నిరంతరాయంగా సరఫరా చేస్తారు. పీఎన్జీ అనుమతులను వేగవంతం చేయాలని తాజా ఉత్తర్వులో ప్రభుత్వం ఆదేశించింది. నిర్దేశిత గడువులోగా అనుమతులు ఇవ్వకపోతే ఇచ్చినట్లుగానే భావిస్తారని స్పష్టం చేసింది.


