మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ప్రపంచ చమురు, గ్యాస్ వనరులకు పట్టుగొమ్మ వంటి ఈ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో సరఫరా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హోర్ముజ్ జలసంధి మూతపడే అవకాశం ఉందన్న వార్తలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఆకాశాన్నంటుతున్న ముడి చమురు ధరలు
యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ముడి చమురు ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఒకానొక దశలో బ్యారెల్ ధర ఏకంగా 119 డాలర్లకు చేరుకోవడంతో, చమురు దిగుమతులపై ఆధారపడే దేశాల ఆర్థిక స్థితిగతులు తలకిందులయ్యాయి. ఈ సంక్షోభాన్ని తట్టుకోవడానికి పలు దేశాలు ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవడం, ఇతర దేశాల నుంచి సరఫరా మార్గాలను వెతుక్కోవడం వంటి చర్యలు చేపడుతున్నాయి.
ధరల పెంపులో ముందంజలో ఉన్న దేశాలు
గ్లోబల్ పెట్రోల్ ప్రైసెస్ డేటా ప్రకారం, మార్చి రెండో వారం నాటికి దాదాపు 85 దేశాలు పెట్రోల్ ధరలను భారీగా పెంచాయి. ఫిబ్రవరి 23 నుంచి నమోదైన గణాంకాల ప్రకారం ఇంధన ధరల పెరుగుదల ఇలా ఉంది..
| దేశం | పెరుగుదల శాతం |
|---|---|
| మయన్మార్ | 55.4% |
| ఫిలిప్పీన్స్ | 54.2% |
| కంబోడియా | 52.8% |
| లెబనాన్ | 28.6% |
| కెనడా | 25.0% |
| పాకిస్తాన్ | 24.4% |
| చైనా | 23.2% |
| జపాన్ | 19.6% |
పొరుగు దేశాలైన పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ ధర 1.15 డాలర్లు, శ్రీలంకలో 1.45 డాలర్లు, ఆఫ్ఘనిస్తాన్లో 0.98 డాలర్లుగా నమోదైంది.
ధరలలో ఈ వ్యత్యాసం ఎందుకు?
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు ముడి చమురు దాదాపు ఒకే ధరకు అందుబాటులో ఉన్నప్పటికీ, వినియోగదారుడి వద్దకు వచ్చేసరికి ధరలు మారడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి..
పంపిణీ వ్యయం: చమురును శుద్ధి చేయడం, రవాణా చేయడం, పంపిణీ చేయడానికి అయ్యే ఖర్చు. ఇది ధరలో చాలా తక్కువ భాగం మాత్రమే.
పన్నుల ప్రభావం: ఇంధన ధరలను నిర్ణయించడంలో ఎక్సైజ్ సుంకం (Excise Duty), స్థానిక పన్నులు కీలక పాత్ర పోషిస్తాయి. ఒక్కో దేశం ఒక్కో రకమైన పన్ను విధానాన్ని అనుసరించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలలో భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో చమురు ధరల పెరుగుదల సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టడమే కాకుండా, రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగేలా చేస్తోంది.


