భారత్, కువైట్‌ మధ్య... సుదృఢ బంధం | PM modi meets with Crown Prince of Kuwait | Sakshi
Sakshi News home page

భారత్, కువైట్‌ మధ్య... సుదృఢ బంధం

Dec 23 2024 5:03 AM | Updated on Dec 23 2024 6:33 AM

PM modi meets with Crown Prince of Kuwait

కీలక రంగాల్లో మరింత సహకారం

కువైట్‌ రాజుతో ప్రధాని మోదీ భేటీ

భారత్‌లో పర్యటించాలని ఆహ్వానం

కువైట్‌ సిటీ:  మిత్రదేశాలైన భారత్, కువైట్‌ మధ్య బంధం మరింత దృఢపడింది. రెండు దేశాల నడుమ సంబంధాలు కీలక వ్యూహాత్మక భాగస్వా మ్యంగా మారాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కువైట్‌ సిటీలోని మెజెస్టిక్‌ బయన్‌ ప్యాలెస్‌లో కువైట్‌ రాజు, ప్రధాని షేక్‌ మెషల్‌ అల్‌–అహ్మద్‌ అల్‌–జబేర్‌ అల్‌–సబాతో సమావేశమయ్యారు. మోదీకి రాజు సాదర స్వాగతం పలికారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను నూతన శిఖరాలకు చేర్చే దిశగా చర్చలు జరిపారు. ఐటీ, ఫార్మాస్యూటికల్స్, ఫిన్‌టెక్, మౌలిక సదుపాయాలు, భద్రత తదితర కీలక రంగాల్లో పరస్పర సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై విస్తృతస్థాయిలో సంప్రదింపులు జరిపారు.

రెండు దేశాల మధ్య ద్వైపాకిక్ష సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయానికొచ్చారు. కువైట్‌లో నివసిస్తున్న 10 లక్షల మంది భారతీయుల సంక్షేమానికి సహకరిస్తున్నందుకు కువైట్‌ రాజుకు ప్రధాని మోదీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. తమదేశ అభివృద్ధి ప్రయాణంలో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారని, వెలకట్టలేని సేవలు అందిస్తున్నారని రాజు ప్రశంసించారు. భారత్‌లో పర్యటించాలని కువైట్‌ రాజును మోదీ ఆహా్వనించారు. 

షేక్‌ మెషల్‌ అల్‌–అహ్మద్‌ అల్‌–జబేర్‌ అల్‌–సబాతో అద్భుతమైన భేటీ జరిగిందని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. కీలక రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించామని తెలిపారు. రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని వ్యూహాత్మక స్థాయికి తీసుకెళ్లామని ఉద్ఘాటించారు. రాబోయే రోజుల్లో భారత్, కువైట్‌ సంబంధాలు ఉన్నతంగా పరిఢవిల్లాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ శనివారం కువైట్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.

తొలి రోజు ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కువైట్‌లోని భారతీయులతో సమావేశమయ్యారు. రెండో రోజు ఆదివారం కువైట్‌ రాజుతో చర్చల్లో పాల్గొన్నారు. అనంతరం పర్యటన ముగించుకుని మోదీ భారత్‌ చేరుకున్నారు. 43 ఏళ్ల తర్వాత కువైట్‌లో పర్యటించిన తొలి భారత ప్రధాని ఆయనే కావడం విశేషం. 

అవగాహన ఒప్పందాలు 
ప్రధాని మోదీ, కువైట్‌ రాజు చర్చల సందర్భంగా భారత్, కువైట్‌ మధ్య పలు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. రక్షణ, క్రీడలు, సంస్కృతి, సోలార్‌ ఎనర్జీ విషయంలో ఒప్పందాలు కుదిరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. రక్షణపై కుదిరిన ఒప్పందంలో రక్షణ పరిశ్రమలు, రక్షణ పరికరాల సరఫరా, ఉమ్మడిగా సైనిక విన్యాసాలు, శిక్షణ, నిపుణులు, జవాన్ల మారి్పడి, పరిశోధన–అభివృద్ధిలో పరస్పర సహకారం వంటి అంశాలను చేర్చారు. ప్రస్తుతం కువైట్‌ నాయకత్వం వహిస్తున్న గల్ఫ్‌ కో–ఆపరేషన్‌ కౌన్సిల్‌ (జీసీసీ)తో సహకారాన్ని మరింత పెంచుకోవడానికి భారత్‌ ఆసక్తి చూపింది.

మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం 
ప్రధాని నరేంద్రమోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ ముబారక్‌ అల్‌–కబీర్‌’ లభించింది. కువైట్‌ రాజు షేక్‌ మెషల్‌ అల్‌–అహ్మద్‌ అల్‌–జబేర్‌ అల్‌–సబా ఆదివారం ఆయనకు ఈ అవార్డు ప్రదానం చేశారు. ఇది మోదీకి దక్కిన 20వ అంతర్జాతీయ గౌరవం. స్నేహానికి చిహ్నంగా దేశాధినేతలు, విదేశీ దౌత్యవేత్తలు, విదేశీ రాజకుటుంబ సభ్యులకు కువైట్‌ ఇచ్చే అత్యున్నత పురస్కారం ఆర్డర్‌ ఆఫ్‌ ముబారక్‌ అల్‌ కబీర్‌ అవార్డు. గతంలో బిల్‌ క్లింటన్, ప్రిన్స్‌ చార్లెస్, జార్జ్‌ బుష్‌ వంటి విదేశీ నేతలు ఈ పురస్కారం అందుకున్నారు.

ఉగ్రవాదాన్ని ఉమ్మడిగా ఎదుర్కొందాం 
ఉగ్రవాద భూతాన్ని ఉమ్మడి ఎదిరించాలని మోదీ, కువైట్‌ రాజు నిర్ణయించుకున్నారు. పెనుముప్పుగా ఉగ్రవాదాన్ని అరికట్టే విషయంలో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవాలని తీర్మానించుకున్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఇరువురు నేతలు తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న అంతం చేయాల్సిందేనని తేలి్చచెప్పారు. ఉగ్రమూకలకు ఆర్థిక సాయం అందే మార్గాలను మూసివేయడంతోపాటు ఉగ్రవాదానికి స్వర్గధామంగా మారిన దేశాలపై కఠిన ఆంక్షలు విధిస్తే పరిస్థితిలో కచి్చతంగా మార్పు వస్తుందని మోదీ, కువైట్‌ రాజు అభిప్రాయపడ్డారు. ఇద్దరు నాయకుల భేటీపై ఈ మేరకు ఉమ్మడి ప్రకటన విడుదలైంది.

Advertisement
 
Advertisement
Advertisement