మెక్సికో సుందరికి మిస్ యూనివర్స్ కిరీటం
మొదటి రన్నరప్గా థాయ్లాండ్ భామ
మూడో స్థానంలో నిలిచిన వెనెజువెలా సుందరి
బ్యాంకాక్: మెక్సికో భామ ఫాతిమా బాష్ ఫెర్నాండెజ్ 2025 సంవత్సరానికి గాను విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకుంది. థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో 74వ మిస్ యూనివర్స్ పోటీలు కన్నుల పండువగా జరిగాయి. వివిధ దేశాల నుంచి 120 మంది సుందరీమణులు పాల్గొన్నారు. 25 ఏళ్ల ఫాతిమా బాష్ ఫెర్నాండెజ్ అన్ని రౌండ్లలో నెగ్గి విశ్వసుందరిగా అవతరించింది.
మిస్ థాయ్లాండ్ ప్రవీనర్ సింగ్(29) మొదటి రన్నరప్గా ఘనత సాధించింది. మిస్ వెనెజువెలా స్టెఫానీ అడ్రియానా అబాసలీ నసీర్(25) మూడో స్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన మణికా విశ్వకర్మ కిరీటం దక్కించుకోలేకపోయారు. టాప్–12 స్థానానికి సైతం ఆమె చేరుకోలేకపోయారు. మిస్ యూనివర్స్–2025 పోటీలకు భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ న్యాయనిర్ణేతల్లో ఒకరిగా వ్యవహరించడం విశేషం.
మేమంతా కలిసికట్టుగా చరిత్ర సృష్టిస్తాం
మిస్ యూనివర్స్ పోటీల్లో భాగంగా తుది రౌండ్లో జడ్జిలు అడిగిన ప్రశ్నకు ఫాతిమా బాష్ ఫెర్నాండెజ్ చెప్పిన సమాధానం అందరినీ మెప్పించింది. ప్రస్తుత ఆధునిక యుగంలో మీరు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటున్నారు. మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని ఏర్పర్చడానికి ఈ కిరీటాన్ని మీరు ఎలా ఉపయోగిస్తారు? అని ప్రశ్నించగా.. ‘‘భద్రత, సమాన అవకాశాల విషయంలో నేటి మహిళలకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ వారు తమ భావాలను వ్యక్తం చేయడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. నేటితరం మహిళలు మార్పును కోరుకుంటున్నారు.
మా గళాన్ని వినిపించడానికి, మార్పును ఆహా్వనించడానికి ఇక్కడికి వచ్చాం. మేమంతా కలిసికట్టుగా చరిత్ర సృష్టిస్తాం’’ అని ఫాతిమా దృఢంగా బదులిచ్చి విజేతగా నిలిచింది. ఫాతిమా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు అభ్యసించారు. స్కూల్లో చదువుకుంటున్న సమయంలో డిస్లెక్సియా, హైపర్ యాక్టివిటీ డిజార్డర్తో బాధపడ్డానని గతంలో ఆమె చెప్పారు. చిన్నప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, చివరకు సేవా మార్గంలో నడిచానని అన్నారు. మిస్ యూనివర్స్ విజేతకు 2.50 లక్షల డాలర్ల నగదు బహుమతి అందజేస్తారని సమాచారం. అంతేకాకుండా ప్రతినెలా 50 వేల డాలర్ల చొప్పున వేతనం కూడా అందుకోవచ్చు.


