ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఇరాన్ ఐఆర్జీసీ దళాల తీరుపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజష్కియన్ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మసూద్.. అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కాగా, ఇప్పటికే ఆయన తన రాజీనామా లేఖను సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీకి పంపినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మేరకు అమెరికా కేంద్రంగా నడిచే ఇరాన్ పత్రిక పలు కథనాలను వెల్లడించింది.
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైన నాటి నుంచి ఇరాన్లో పాలనపై పలు ఊహాగానాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇరాన్ను ఐఆర్జీసీనే కంట్రోల్ చేస్తున్నట్టు తెలిసింది. దానికి బలం చేకూరుస్తూ తాజాగా మసూద్ ఇవే విషయాలను వెల్లడించినట్టు ఆ కథనాలు పేర్కొన్నాయి. అయితే, ఇరాన్ పాలన ఐఆర్జీసీ కమాండర్ల చేతుల్లోకి వెళ్లిపోతున్నట్లు ఆయన తన రాజీనామా లేఖలో హెచ్చరించినట్లు సదరు కథనం వెల్లడించింది. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి కీలక నిర్ణయాల విషయంలో ఇరాన్ ప్రభుత్వ అధికారులను దూరంగా ఉంచుతున్నట్లు ఆరోపించారు.
Iran’s president has reportedly asked to resign, citing a loss of authority inside the country’s ruling system.
According to reports, Masoud Pezeshkian told the Supreme Leader’s office that he and his government have been excluded from major decision-making, leaving him unable… pic.twitter.com/ronp6oNvrI— Fox News (@FoxNews) May 31, 2026
కాగా, అధ్యక్షుడు పెజష్కియాన్ రాజీనామా లేఖపై సుప్రీం లీడర్ ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్లో పెట్టినట్లు వెల్లడించింది. పాలన, చట్టపరంగా తనకు ఉన్న బాధ్యతలను కూడా పూర్తి చేయనీయకుండా చేస్తున్నారని పెజష్కియాన్ ఆరోపించినట్లు వెల్లడించింది. మరోవైపు, ఈ కథనంపై ఇరాన్ అధ్యక్ష కార్యాలయంలోని కమ్యూనికేషన్స్ విభాగం డిప్యూటీ హెడ్ మెహదీ తబాతబాయి స్పందించారు. ప్రస్తుతం అమెరికాతో చర్చల వేళ తప్పుడు రిపోర్టులతో మీడియా గేమ్స్ ఆడుతోందని ఆరోపించారు. తుర్కియే ప్రభుత్వ పత్రిక కూడా ఈ ఖండనను సమర్థించింది. ఇదిలా ఉండగా.. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ ఒప్పంద ప్రతిపాదనలపై స్పందిస్తూ.. ఇరాన్ హక్కులను కాపాడని ఏ డీల్కు తాము అంగీకరించబోమని పేర్కొన్నారు.


