అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్దం సవాళ్లు-ప్రతి సవాళ్ల మధ్య తారాస్థాయికి చేరింది. 48 గంటల్లో హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవకపోతే ఇంధన కేంద్రాలను ఒక్కొక్కటిగా ధ్వంసం చేస్తామని అమెరికా వార్నింగ్ ఇవ్వగా.. ఇరాన్ తొలుత మొత్తబడినట్లే కనిపించి, ఆతర్వాత గట్టి కౌంటరిచ్చింది.
ఇరాన్ శత్రు దేశాలకు చెందిన నౌకలు తప్ప, మిగతా అన్ని నౌకలు హర్మూజ్ జలసంధి ద్వారా వెళ్లవచ్చని ప్రకటించిన ఇరాన్.. అమెరికా మా ఇంధన కేంద్రాలపై దాడులు చేస్తే, హర్మూజ్ జలసంధి పూర్తిగా మూతపడుతుందని వార్నింగ్ ఇచ్చింది.
అలాగే మధ్యప్రాచ్య మౌలిక సదుపాయాలను కోలుకోలేని విధంగా నాశనం చేస్తామని హెచ్చరించింది. అమెరికా 48 గంటల వార్నింగ్ ఇచ్చిన కొద్ది గంటల్లో ఇరాన్ మిలిటరీ ఈ ప్రకటన చేసింది. దీన్ని బట్టి చూస్తే, అమెరికా వార్నింగ్లకు ఇరాన్ బెదిరేలా కనిపించడం లేదు. దెబ్బకు దెబ్బ తీసేలా కనిపిస్తుంది.
ఊపిరి పీల్చుకున్న ప్రపంచం
హర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ తొలుత చేసిన ప్రకటన వల్ల ప్రపంచం మొత్తం ఊపిరి పీల్చుకుంది. ముడి చమురు, సహజ వాయువు సరఫరా అంతరాయం లేకుండా కొనసాగుతుందనే నమ్మకం కలిగింది. ధరల పెరుగుదలపై ఆందోళనలు కూడా ఒకింత తగ్గాయి. అయితే ఇరాన్ తాజా ప్రకటన తర్వాత పరిస్థితి మొదటికొచ్చింది.


