
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రికత్తలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రెండు దేశాల ప్రజలు తమ స్వదేశాలకు చేరుకుంటున్నారు. ఇక, ఉగ్రదాడి కారణంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధం సైతం దెబ్బతింది. ఈ క్రమంలోనే సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపేయడంతో రెచ్చిపోయిన పాక్ ఆవేశంతో భారత్తో వాణిజ్య బంధాన్ని తెంచుకుంది. దీంతో, అసలుకే ఎసరు వచ్చే పరిస్థితిని తెచ్చుకుంది.
భారత్తో వాణిజ్య బంధాన్ని తెంచుకున్న పాకిస్తాన్కు ఔషధాల పరంగా ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో ఔషధ ఎమర్జెన్సీని విధించాల్సి వచ్చింది. తాజాగా ఔషధాల నిల్వల్ని సాధ్యమైనంతగా పెంచుకోవాలని సంబంధిత విభాగాలకు పాక్ వైద్య, ఆరోగ్యశాఖ సూచించింది. ప్రస్తుతం భారత్ నుంచి పాకిస్థాన్.. 30-40 శాతం ఔషధ ముడి సరకు, ఔషధంలో వాడే ప్రధాన పదార్థం, చికిత్స ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ అప్రమత్తమైంది. ఔషధ రంగంపై నిషేధం ప్రభావం గురించి అధికారిక నోటిఫికేషన్ లేనప్పటికీ ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధమయ్యాయని పాకిస్థాన్ ఔషధ నియంత్రణ సంస్థ (డీఆర్ఏపీ) శనివారం వెల్లడించింది.
అనంతరం, డీఆర్ఏపీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. చైనా, రష్యా, ఐరోపా దేశాల నుంచి ఔషధాలను దిగుమతి చేసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పుకొచ్చారు . రేబిస్ టీకా, పాము కాటు మందు, క్యాన్సర్ చికిత్సలకు అవసరమైన ఔషధాలను, మోనోక్లోనల్ యాంటీబాడీస్ తదితరాలను అత్యవసరంగా నిల్వ చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించామని వివరించారు. తగు చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. అయితే, ఔషధాల ఎమర్జెన్సీ నేపథ్యంలో పాకిస్తాన్లో బ్లాక్ మార్కెట్ దందా పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు ఆందోళనకు గురవుతున్నట్టు సమాచారం. దీనిపై తగు చర్యలు తీసుకునేందు కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
భారత ఫార్మానే పాక్కు కీలకం..
ప్రస్తుతం, పాకిస్తాన్ తన ఔషధ ముడి పదార్థాలలో భారత్పై ఆధారపడుతోంది. వీటిలో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (API), వివిధ అధునాతన చికిత్సా ఉత్పత్తులు ఉన్నాయి. ముఖ్యంగా, క్యాన్సర్ నిరోధక చికిత్సలు, జీవ ఉత్పత్తులు, వ్యాక్సిన్లు, సెరా, యాంటీ-రేబిస్ వ్యాక్సిన్ మరియు యాంటీ-స్నేక్ వెనమ్ను భారత్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇక, చాలా వరకు భారత్ చెందిన మందులు.. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, దుబాయ్, తూర్పు సరిహద్దు మీదుగా పాకిస్తాన్లోకి అక్రమంగా రవాణా చేయబడుతున్నాయి. బ్లాక్ మార్కెట్ నుంచి మందులు తరలిస్తున్నారు.
🚨 Crisis Brews in Pakistan's Healthcare
After suspending trade with India over the Pahalgam attack fallout, Pakistan faces a looming pharmaceutical shortage.
Authorities scramble to secure vital drug supplies from China, Russia, and Europe, as 30%-40% of raw materials were… pic.twitter.com/Gz9HCEiLXt— Instant News 247 (@instant_news247) April 26, 2025
భారత్తో పెట్టుకుంటే పాతళానికి పాక్..
ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ స్వీయ తప్పిదాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ.. దివాళా అంచుకు చేరింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి, చిరకాల మిత్రదేశం చైనా పుణ్యమా అని కొద్దిగా కోలుకుంటోంది. కానీ, ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఇలాంటి స్థితిలో భారత్తో స్వల్పకాల యుద్ధం చేసినా పాక్ ఆర్థిక వ్యవస్థ నిండా మునగడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. దాదాపు 50 ఏళ్ల కిందట పాకిస్థాన్.. దక్షిణాసియాలో ధనిక దేశం. స్వాతంత్య్రం వచ్చాక ఆ దేశం మంచి ఆర్థిక వృద్ధిని కనబరచింది. ముఖ్యంగా 1960, 1970లలో ధనిక దేశంగా వెలుగొందింది. బలమైన ఆర్థిక నిర్వహణ, భారీగా విదేశీ సాయం, వ్యవసాయం, పారిశ్రామిక వృద్ధిపై దృష్టి వంటి అంశాలు బాగా కలిసొచ్చాయి.
అనంతర కాలంలో.. దుష్పరిపాలన, సైనిక నియంతలు, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం వంటి చేయడంతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. అందుకే.. నేడు దక్షిణాసియాలోనే అత్యంత పేద దేశాల్లో పాక్ ఒకటిగా మారింది. కోవిడ్ మహమ్మారితో కుదేలైన పాక్ ఆ తర్వాత ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఆపసోపాలు పడుతోంది. పాక్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే.. టీ పొడిని దిగుమతి చేసుకోవడానికి అప్పు చేయాల్సి వస్తోందని.. అందువల్ల టీ వినియోగాన్ని తగ్గించాలని స్వయానా పాక్ ప్రణాళిక శాఖ మంత్రి అహ్సాన్ ఇక్బాల్ కోరారు. దీంతో, ఎంతటి దుస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీనికితోడు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడం వల్ల పాక్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్తో సైనిక ఘర్షణ, యుద్ధం వంటి పరిస్థితులు వస్తే.. అది పాకిస్తాన్ను మరింత దెబ్బతీస్తుంది.