అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కొత్త రాగం ఎత్తుకున్నారు. ఇజ్రాయెల్కు అనుకూలంగా అరబ్, ముస్లిం మెజారిటీ దేశాలపై మరో ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇజ్రాయెల్కు మేలు చేసే విధంగా అబ్రహం ఒప్పందంలో భాగంగా కావాలని పాకిస్తాన్ సహా అరబ్ దేశాలపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ ఒప్పందంలో చేరిన దేశాలు ఇజ్రాయెల్ను అధికారికంగా దేశంగా గుర్తించాలన్నదే ఇందులోని ముఖ్య ఉద్దేశ్యం. అయితే, ఈ ఒప్పందంపై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో అమెరికాకు లాభమేంటి? అనే ప్రశ్న ఎదురవుతోంది. ఇంతకీ ఈ అబ్రహం ఒప్పందం ఏంటి? పాకిస్తాన్ ఎందుకు టెన్షన్ పడుతోంది అనే విషయాలు తెలుసుకుందాం..
అబ్రహాం ఒప్పందం అనేది 2020లో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ మరియు కొన్ని అరబ్ దేశాల మధ్య కుదిరిన సాధారణీకరణ ఒప్పందం. దీని ప్రధాన ఉద్దేశం ఇజ్రాయెల్ను అధికారికంగా దేశంగా గుర్తించి, దౌత్య, ఆర్థిక, భద్రతా సంబంధాలను ప్రారంభించడం. ఈ ఒప్పందం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, మొరాకోలతో సహా పలు అరబ్ దేశాలతో ఇజ్రాయెల్కు అధికారిక సంబంధాలను ప్రారంభించింది. ఇజ్రాయెల్ను దేశంగా గురిస్తూ మధ్యప్రాచ్యంలో ఒక చారిత్రాత్మక నమూనా మార్పునకు నాంది పలికింది. దశాబ్దాలుగా పాలస్తీనా సమస్య పరిష్కారమయ్యే వరకు చాలా అరబ్ దేశాలు ఇజ్రాయెల్ను దేశంగా గుర్తించడానికి నిరాకరించాయి. కానీ, అబ్రహం ఒప్పందంతో ఇజ్రాయెల్కు లైన్ క్లియర్ అయ్యింది. ఈ ఒప్పందంలో చేరిన అరబ్ దేశాలు ఇజ్రాయెల్ను అధికారికంగా దేశంగా గుర్తించాయి.
అబ్రహాం ఒప్పందం లక్ష్యం
దౌత్య సంబంధాలు: ఇజ్రాయెల్తో అధికారిక రాయబార కార్యాలయాలు, దౌత్య సంబంధాలు ఏర్పరచడం.
ఆర్థిక సహకారం: వాణిజ్యం, పెట్టుబడులు, పర్యాటకం, టెక్నాలజీ రంగాల్లో భాగస్వామ్యం.
భద్రతా సహకారం: ఇరాన్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి కలిసికట్టుగా వ్యూహాలు.
ఒప్పందంలోని దేశాలు..
యూఏఈ, బహ్రెయిన్, మొరాకో, సూడాన్, కజికిస్తాన్: ఈ దేశాలు ఇజ్రాయెల్ను అధికారికంగా దేశంగా గుర్తించాయి.
సౌదీ అరేబియా, పాకిస్తాన్: ఇంకా గుర్తించలేదు. వీరి ప్రజాభిప్రాయం పాలస్తీనా రాష్ట్రం ఏర్పాటుపై బలంగా ఉంది.
పాలస్తీనా సమస్య: ఇజ్రాయెల్ను గుర్తించడం. పాలస్తీనా రాష్ట్రం ఏర్పాటుపై స్పష్టత లేకుండా ముందుకు వెళ్లడం. అందుకే కొన్ని దేశాలు వెనుకంజ వేస్తున్నాయి.
అబ్రహాం ఒప్పందం ఇజ్రాయెల్కు వ్యూహాత్మకంగా లాభదాయకం. కానీ పాలస్తీనా సమస్య పరిష్కారం లేకపోవడం వల్ల రాజకీయంగా కొన్ని నష్టాలు ఉన్నాయి. అమెరికాకు ఇది మధ్యప్రాచ్యంలో తన ప్రభావాన్ని పెంచే ముఖ్యమైన వ్యవహారం కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ట్రంప్.. అరబ్ దేశాల అధినేతలతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా అబ్రహం ఒప్పందంలో భాగంగా కావాలని ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. కానీ పాలస్తీనా సమస్యపై ఇది పెద్ద ప్రభావం చూపిస్తోంది.
ఇజ్రాయెల్కు లాభాలు
అరబ్ గుర్తింపు: UAE, బహ్రెయిన్, మొరాకో వంటి దేశాలతో అధికారిక సంబంధాలు ఏర్పడటం వల్ల ఇజ్రాయెల్కు అరబ్ ప్రపంచంలో గుర్తింపు పెరిగింది.
ఆర్థిక ప్రయోజనాలు: వాణిజ్యం, టెక్నాలజీ, పర్యాటకం రంగాల్లో కొత్త అవకాశాలు. ఉదాహరణకు, UAE–ఇజ్రాయెల్ మధ్య బిలియన్ల డాలర్ల వ్యాపార ఒప్పందాలు కుదిరాయి.
భద్రతా సహకారం: ఇరాన్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి గల్ఫ్ దేశాలతో రక్షణ సహకారం పెరిగింది.
ప్రాంతీయ స్థానం: ఇజ్రాయెల్ CENTCOM (US Central Command)లో చేరడం వల్ల ప్రాంతీయ రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర.
ఇజ్రాయెల్కు నష్టాలు
పాలస్తీనా సమస్య: ఒప్పందంలో పాలస్తీనా రాష్ట్రం ఏర్పాటుపై స్పష్టత లేకపోవడం వల్ల అరబ్ ప్రజల్లో వ్యతిరేకత.
ప్రజాభిప్రాయం: గాజా యుద్ధం తర్వాత అరబ్ దేశాల్లో ప్రజలు ఇజ్రాయెల్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సౌదీ ఆలస్యం: పాలస్తీనా సమస్య పరిష్కారం లేకుండా సౌదీ అరేబియా ముందుకు రావడం లేదు.
అమెరికాకు లాభాలు
ప్రభావం పెరుగుదల: మధ్యప్రాచ్యంలో అమెరికా ప్రభావం మరింత బలపడింది.
భద్రతా నిర్మాణం: US మిత్రదేశాల మధ్య రక్షణ సహకారం పెరిగింది, ఇరాన్ను ఎదుర్కోవడంలో సమన్వయం సాధ్యమైంది.
ఆర్థిక అవకాశాలు: అమెరికా కంపెనీలకు గల్ఫ్–ఇజ్రాయెల్ మార్కెట్లలో కొత్త అవకాశాలు.
వ్యూహాత్మక విజయం: దశాబ్దాల తర్వాత అరబ్–ఇజ్రాయెల్ సంబంధాలను తెరవడం ద్వారా అమెరికా తన దౌత్య విజయాన్ని ప్రదర్శించింది.
పాలస్తీనా సమస్యలో మార్పులు
అరబ్ ఐక్యతలో విరుగుడు: ఇంతకాలం అరబ్ దేశాలు పాలస్తీనా రాష్ట్రం ఏర్పాటుపై ఒకే విధమైన మద్దతు చూపేవి. కానీ UAE, బహ్రెయిన్, మొరాకో, సూడాన్ ఇజ్రాయెల్ను గుర్తించడం వల్ల ఆ ఐక్యత బలహీనపడింది.
పాలస్తీనా నాయకత్వం నిరాశ: పాలస్తీనా అథారిటీ మరియు హమాస్ ఈ ఒప్పందాలను “వంచన”గా పేర్కొన్నాయి.
ప్రజాభిప్రాయం: అరబ్ ప్రజల్లో చాలా మంది పాలస్తీనా సమస్య పరిష్కారం లేకుండా ఇజ్రాయెల్తో సంబంధాలు సాధారణీకరించడాన్ని వ్యతిరేకిస్తున్నారు.
ఇరాన్ అంశం
ఇరాన్ అబ్రహాం ఒప్పందంలో చేరడం సిద్ధాంతపరంగా అసాధ్యం. ఎందుకంటే, ఇజ్రాయెల్ను గుర్తించడం ఇరాన్ రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకం. కానీ, ఒప్పందం వల్ల ఇరాన్పై వ్యూహాత్మక ఒత్తిడి పెరిగింది. గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్తో కలిసి పనిచేయడం వల్ల ఇరాన్ తన ప్రభావాన్ని నిలుపుకోవడానికి మరింతగా ప్రాక్సీ యుద్ధాలు మరియు హోర్ముజ్ జలసంధి నియంత్రణపై ఆధారపడుతోంది.
పాకిస్తాన్ ఇలా..
పాకిస్తాన్ ఇప్పటివరకు అబ్రహాం ఒప్పందంలో చేరలేదు. ఎందుకంటే దేశీయ ప్రజాభిప్రాయం, పాలస్తీనా సమస్యపై కఠినమైన వైఖరి ఉంది. అలాగే ఇరాన్తో సంబంధాలు ఉన్నాయి. పాకిస్తాన్ ఇప్పటికీ ఇజ్రాయెల్ను దేశంగా గుర్తించలేదు. పాలస్తీనా రాష్ట్రం ఏర్పడిన తర్వాతే ఇజ్రాయెల్తో సంబంధాలు సాధారణీకరించవచ్చు అని గతంలోనే అధికారికంగా ప్రకటించింది. మరోవైపు.. పాకిస్తాన్ ప్రజలు పాలస్తీనా రాష్ట్రానికి బలమైన మద్దతు ఇస్తున్నారు. ఇజ్రాయెల్తో సంబంధాలు సాధారణీకరించడమంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను రేపే అవకాశం ఉంది. కానీ, డొనాల్డ్ ట్రంప్ మాత్రం పాకిస్తాన్ను అబ్రహాం ఒప్పందంలో చేరమని కోరుతూ ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని షరీఫ్కు అమెరికా ఒత్తిడిని ఎదుర్కొంటూ, ప్రజాభిప్రాయాన్ని సమతుల్యం చేయాల్సిన క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ను దేశంగా గుర్తిస్తే.. ఇటు ఇరాన్తో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. దీంతో, ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అనే పరిస్థితి ఏర్పడింది.


