మొదటిసారిగా ధ్రువీకరించిన చైనా
బీజింగ్: గతేడాది భారత్తో జరిగిన నాలుగు రోజుల యుద్ధంలో పాకిస్తాన్కు సైనికపరమైన సాంకేతిక సాయం అందజేసిన విషయాన్ని చైనా ధ్రువీకరించింది. ఆ దేశం ఇలా ఒప్పుకోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా(ఏవీఐసీ) సంస్థ అధీనంలోని చెంగ్దు ఎయిర్క్రాఫ్ట్ డిజైన్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇంజనీరింగ్ అధికారి ఝాంగ్ హెంగ్ తాజాగా అధికార చైనా టీవీకిచ్చిన ఇంటర్య్వూలో ఈ విషయం వెల్లడించారు.
ఈ సంస్థ చైనా అత్యాధునిక యుద్ధ విమానాలను, డ్రోన్ల డిజైన్లను రూపొందిస్తుంటుంది. గతేడాది మేలో ఆపరేషన్ సిందూర్ ప్రకటించిన భారత్ పాకిస్తాన్లోని ఉగ్రవాద కేంద్రాలతోపాటు వైమానిక, సైనిక స్థావరాలపైనా దాడులు చేసి, తీవ్రంగా దెబ్బతీయడం తెలిసిందే. ఆ నాలుగు రోజుల యుద్ధం సమయంలో పాకిస్తాన్కు సాంకేతిక మద్దతిచ్చామని ఝాంగ్ తాజాగా వెల్లడించారు. పాకిస్తాన్ వద్దనున్న జె–10సీఈ యుద్ధ విమానాలు ఏవీఐసీ అనుబంధ సంస్థ తయారు చేసినవే కావడం గమనార్హం.
‘ఆ నాలుగు రోజులపాటు జెట్ విమానాల శబ్ధాలు, హెచ్చరిక సైరన్ల మోతలతోపాటు ఉదయం వేళలోనే 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో పనిచేయడం మాకు శారీరకంగానే కాదు, మానసికంగా కూడా పెద్ద పరీక్షగా అనిపించింది. అయితే, మేం తయారు చేసిన జె10సీఈ యుద్ధ విమానాలు సామర్థ్యానికి తగ్గట్లుగా పనిచేసేలా చూడటం మా బాధ్యత’అని ఝాంగ్ వివరించారు. భారత్తో నాలుగు రోజుల యుద్ధ సమయంలో పాకిస్తాన్కు సాయం అందించారన్న ఆరోపణలపై చైనా విదేశాంగ శాఖ, సైనికాధికారులు ఇప్పటికీ సూటిగా సమాధానం ఇవ్వకపోకవడం గమనార్హం.


