భారత్‌తో టెన్షన్‌ వేళ పాక్‌కు షాక్‌.. ఊహించని దెబ్బకొట్టిన బీఏల్‌ఏ | Baloch rebels capture major city And seize in Pakistan | Sakshi
Sakshi News home page

భారత్‌తో టెన్షన్‌ వేళ పాక్‌కు షాక్‌.. ఊహించని దెబ్బకొట్టిన బీఏల్‌ఏ

May 4 2025 11:14 AM | Updated on May 4 2025 4:42 PM

Baloch rebels capture major city And seize in Pakistan

క్వెట్టా: పహల్గాం ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ దాయాది దేశానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్ సైన్యానికి బలోచ్ లిబరేషన్ ఆర్మీ నుంచి ఊహించని షాక్‌ తగిలింది. పాక్‌ సైన్యానికి సవాల్‌ విసురుతూ కీలకమైన మంగుచోర్ పట్టణాన్ని బీఎల్ఏ స్వాధీనం చేసుకుంది. ఇదే సమయంలో సైనిక, ప్రభుత్వ అధికారులను సైతం బందీలుగా పట్టుకుంది. అలాగే, బీఎల్‌ఏ బలగాలు.. క్వెట్టా నగరం దిశగా వెళ్తున్నట్టు తెలుస్తోంది.

వివరాల ప్రకారం.. ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌ ప్రభుత్వం, సైన్యాన్ని టార్గెట్‌ చేసిన బీఎల్‌ఏ దాడులు చేసింది. ఇక, తాజాగా పాక్‌ సైన్యంపై తిరుగుబాటు చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యంపై బలోచ్ లిబరేషన్ ఆర్మీ సవాల్ విసిరింది. కీలకమైన మంగుచోర్ పట్టణాన్ని బీఎల్ఏ స్వాధీనం చేసుకుంది. బీఎల్ఏకు చెందిన అత్యంత క్రూరమైన, ప్రత్యేక శిక్షణ పొందిన 'డెత్ స్క్వాడ్' బృందం ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు సమాచారం. ఈ బృందం మంగుచోర్ పట్టణంలోకి చొచ్చుకెళ్లి, అక్కడ ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను, భద్రతా సంస్థల ప్రాంగణాలను తమ అదుపులోకి తీసుకుంది. ఇంతటితో ఆగకుండా, పట్టణంలో విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఉన్నత స్థాయి సైనిక, ప్రభుత్వ అధికారులను సైతం బందీలుగా చేసుకుంది.

బలుచిస్తాన్‌ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని బీఎల్‌ఏ పోరాడుతోంది. ఈ క్రమంలో బీఎల్‌ఏ వరుస దాడులతో బలూచిస్తాన్‌పై పాకిస్తాన్‌ నియంత్రణ కోల్పోతోంది. ఇక, ఇప్పటికే బీఎల్‌ఏ దాడుల్లో వందలాదిమంది పాక్‌ సైనికులు మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం పాక్‌ సైనికులు వెళుతున్న ట్రైన్‌ని హైజాక్‌ చేసిన బీఎల్‌ఏ.. పాక్‌ సైనికులను హతమార్చింది. కొద్ది రోజుల క్రితం బీఎల్‌ఏ పాక్‌ సైన్యం కాన్వాయ్‌పై ఐఈడీ దాడి చేయడంతో ఏకంగా 10 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వారు ఎంత దూకుడుగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నారో పాక్ ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. పాకిస్తాన్‌లోని నైరుతి ప్రాంతమే బలూచిస్తాన్‌. ఇది పాక్‌లో ఒక ప్రావిన్స్‌గా ఉంది. పాకిస్తాన్‌ మొత్తం విస్తీర్ణంలో 44 శాతం బలూచిస్తాన్ ఉంటుంది. విస్తీర్ణంపరంగా పాకిస్థాన్‌లో అతి పెద్ద ప్రావిన్స్‌గా బలూచిస్తాన్‌ ఉంది. అలాగే మిగతా అన్ని ప్రావిన్స్‌లో కెల్లా అతి తక్కువ జనాభా ఉన్న ప్రావిన్స్‌ కూడా బలూచిస్తానే. బలూచిస్తాన్‌లో చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు వనరులు పుష్కలంగా ఉన్నాయి. బ్రిటిష్‌ ఇండియాలో విలీనం చేయకముందువరకు బలూచిస్తాన్‌ స్వతంత్ర దేశంగానే ఉండేది. బ్రిటిష్‌ వారి నుంచి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత దేశ విభజన తర్వాత పాకిస్తాన్‌లో భాగమైంది. ఆ తర్వాత కొంత కాలానికి స్వతంత్ర దేశం కోసం బలూచిస్తాన్‌ నుంచి డిమాండ్‌ పుట్టుకొచ్చింది.

అలాగే ఆ ప్రావిన్స్‌లో పాక్‌ సాగిస్తున్న మారణకాండ కూడా తిరుగుబాటుకు మరో కారణం. 2011 నుంచి 2024 జనవరి వరకు పాక్‌లో మొత్తం 10,078 మంది అదృశ్యం అయ్యారు. అదృశ్యమైనవారిలో 2,752 మంది బలూచ్‌ పౌరులే. 2001-2017 మధ్య 5,228 మంది బలూచ్‌ పౌరులు అదృశ్యం కావడం గమనార్హం. ప్రస్తుతం బీఎల్‌ఏ యాక్టివ్‌గా వేర్పాటువాద కార్యకలాపాలు సాగిస్తోంది. బలూచిస్తాన్‌ స్వతంత్ర దేశం కావాలనే డిమాండ్‌తో బీఎల్‌ఏ ఏర్పాటైంది. దశాబ్ద కాలంగా పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement