స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం..అడ్డుగా ఉన్నాడని దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం..అడ్డుగా ఉన్నాడని దారుణ హత్య

May 17 2026 11:29 AM | Updated on May 17 2026 11:29 AM

పార్టీకి పిలిచి దారుణం

గచ్చిబౌలి: తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ యువకుడు మహిళ భర్తను దారుణంగా హత్యచేశాడు. శనివారం శేరిలింగంపల్లిలో డీసీపీ శ్రీనివాస్‌ వివరాలు వెల్లడించారు.

● పటాన్‌చెరులో హోటల్‌ నిర్వహిస్తున్న బైండ్ల నవీన్‌(27), ఇస్నాపూర్‌కు చెందిన ట్రాలీ ఆటో డ్రైవర్‌ రాయిగల్ల శేఖర్‌(36) స్నేహితులు. తరచూ శేఖర్‌ ఇంటికి నవీన్‌ వచ్చేవాడు. ఈ క్రమంలో శేఖర్‌ భార్య ప్రమీలతో నవీన్‌ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. తన భార్య ఓ మహిళ వద్ద ఫోన్‌ ఉంచి తరచుగా నవీన్‌తో మాట్లాడుతోందని శేఖర్‌ తెలుసుకున్నాడు. ఇటీవల భార్య గర్భం దాల్చడంతో నవీన్‌ మూలంగానే గర్భవతి అయిందని అనుమానించి వేధించసాగాడు. ఈ విషయం నవీన్‌తో చెప్పి ప్రమీల వాపోయింది. దీంతో శేఖర్‌ను అంతమొందించాలని నవీన్‌ ప్లాన్‌ వేశాడు.

మద్యం తాగించి...

ఈ నెల 12న రాత్రి శేఖర్‌కు నవీన్‌ ఫోన్‌ చేసి పార్టీ చేసుకుందామని పిలిచాడు. ఇద్దరూ ముత్తంగి ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డు సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. శేఖర్‌కు మద్యం తాగించి గొడవపడ్డ నవీన్‌ బండ రాయితో తలపై మోది హత్య చేశారు. మృతదేహంపై అట్టముక్కలు కప్పి రాయిని మరోచోట పడేశాడు. ప్రమీలకు ఫోన్‌చేసి నీ భర్తను చంపేశానని చెప్పాడు. మృతుడి ఫోన్‌ తీసుకొని వెళ్లిపోయాడు.

ఔటర్‌ వద్ద మృతదేహం...

మరుసటి రోజు ప్రమీల..తన భర్త ఇంటికి రాలేదని అతను పనిచేసే కంపెనీకి వెళ్లి అడిగింది. ఈ నెల 14న ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డు సమీపంలో గుర్తు తెలియని మృతదేహం ఉందని పటాన్‌చెరు పోలీసులకు సమాచారం అందింది. ఆ మృతదేహం తన అన్నదే అని శేఖర్‌ తమ్ముడు గుర్తించాడు. భార్య మాత్రం ఎవరు చంపారో తనకు తెలియదని పోలీసులను నమ్మించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రమీల తీరు అనుమానాస్పదంగా ఉండటంతో తమదైన శైలిలో విచారించగా నవీన్‌ హత్య చేశాడని తెలిపింది. నవీన్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. బైండ్ల నవీన్‌తోపాటు ప్రమీలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

బండరాయితో కొట్టి అంతమొందించిన ప్రియుడు

మృతుడి భార్య, నిందితుడు అరెస్ట్‌

Advertisement
 
Advertisement
Advertisement