తెలుగు టీచర్లు కావలెను! | - | Sakshi
Sakshi News home page

తెలుగు టీచర్లు కావలెను!

Jun 6 2025 12:03 PM | Updated on Jun 6 2025 4:41 PM

తెలుగు టీచర్లు కావలెను!

తెలుగు టీచర్లు కావలెను!

తెలుగులోనే బోధన నిబంధనతో భారీగా డిమాండ్‌

మాతృభాషపై పట్టున్న ఉపాధ్యాయుల కొరత

అమలుపై వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలు

సీబీఎస్‌ఈ నిబంధనతో వెతుకులాటలో పాఠశాలలు

సాక్షి, సిటీబ్యూరో: విద్యార్థులకు మాతృభాషలోనే బోధించాలన్న సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) నిర్ణయం పలు పాఠశాలలను గందరగోళానికి గురి చేస్తోంది. ఈ నిబంధన కూడా 2025–26 విద్యా సంవత్సరం నుంచే అమలులోకి రానుంది. ఇందుకోసం పాఠశాలలు పెద్ద ఎత్తున తెలుగు ఉపాధ్యాయులను నియమించాల్సి వస్తోంది. నగరంలోని పలు పాఠశాలల ప్రిన్సిపాళ్లు చెబుతున్న ప్రకారం.. 40 శాతానికి పైగా ఉపాధ్యాయులు తెలుగు తెలిసినవారు కాకపోవడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది.

కొరతే.. సమస్య..

జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) ప్రకారం, కొత్త నిబంధనలో భాగంగా విద్యార్థులకు రెండో తరగతి వరకు తమ మాతృభాషలో లేదా రాష్ట్ర భాషలో బోధన అందించాలి. ‘ఇది అమలు చేయడంలో ప్రధాన సమస్య ఉపాధ్యాయుల కొరతే. తెలుగు బోధనకు ప్రత్యేక తరగతులు నిర్వహించాల్సి వస్తుంది లేదా సబ్జెక్ట్‌ అనువదించేందుకు కొత్త ఉపాధ్యాయులను నియమించాలి’ అని కొంపల్లిలోని ఓ పాఠశాల డైరెక్టర్‌ అన్నారు. ‘టాప్‌ స్కూళ్లలో కనాకష్టంగా 10% ఉపాధ్యాయులే తెలుగులో బోధించగలరు’ అని చెప్పారాయన.

గట్టి సవాలే..

తెలుగు బోధన మీడియంగా ఉండటం గట్టి సవాలేనని హైదరాబాద్‌ సాహోదయ స్కూల్స్‌ కాంప్లెక్స్‌లో సభ్యులుగా ఉన్న పలు సీబీఎస్‌ఈ పాఠశాలల ప్రిన్సిపాళ్లు కూడా అంటున్నారు. రామంతాపూర్‌లోని ఓ పేరొందిన స్కూల్‌కి ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ ‘తెలంగాణ నుంచే కాక ఇతర రాష్ట్రాల్లోనూ తరచూ ఉపాధ్యాయులు ట్రాన్స్‌ఫర్స్‌పై వస్తూ ఉంటారు. వారిలో చాలామంది ఇంగ్లిష్‌ మీడియంలో చదివినవారు కాబట్టి వారికి తెలుగుపై పట్టు ఉండడం లేదు’ అని అన్నారు. అదే పరిస్థితి విద్యార్ధులకు కూడా ఎదురవుతుందని, వారు కూడా రాష్ట్రాలతో పాటు స్కూళ్లు మారుతూ ఉంటారని.. దీంతో ఈ నిబంధన అమలు కష్టసాధ్యమని ఆయన గుర్తు చేశారు.

మేలు కూడా..

సమస్యలు ఎలా ఉన్నప్పటికీ.. ఈ నిబంధన మేలు చేస్తుందని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా స్టేట్‌ సిలబస్‌ అమలు చేస్తున్న పలు పాఠశాలల యాజమాన్యాలకు ఇది మంచి మార్పుగా అనిపిస్తోంది ‘మన దగ్గర చాలా మంది టీచర్లకు తెలుగు తెలుసు తెలుగు మీడియం వల్ల విద్యార్థులకు మెరుగైన పునాది పడుతుంది. తద్వారా ఉన్నత తరగతులలో సులభంగా విషయాలు అర్థం చేసుకుంటారు’ అని రాష్ట్ర గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య సంఘం కార్యదర్శి శేఖర్‌ రావు అంటున్నారు.

ఈ విధానం మంచిదే.. కానీ..

మాతృభాషలో నేర్చుకుంటే కాన్సెప్ట్స్‌ బాగా అర్థమవడానికి నేర్చుకున్నది ప్రాసెస్‌ చేసుకోవడానికి మేధాశక్తి పెరిగేందుకు వీలుంటుంది. అది చిన్న వయసులో జరగడం చాలా ఉపయుక్తం. దీనివల్ల మనం సంస్కృతీ సంప్రదాయాలను బాగా ప్రమోట్‌ చేయగలుగుతాం. మాతృభాషలో నేర్చుకోవడం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పిల్లలు ఉపాధ్యాయులతో బాగా ఇంటరాక్ట్‌ కాగలుగుతారు. ఈ లాభాలున్నప్పటికీ.. ప్రస్తుతం దీనిని అమలు చేయడంలో కొన్ని సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా టీచర్లకు శిక్షణ, అలాగే రీసోర్సెస్‌ సమకూర్చుకోవాలి. మరోవైపు ప్రస్తుత గ్లోబల్‌ మార్కెట్‌ను చూసుకుంటే ఆంగ్ల భాషా నైపుణ్యం చాలా అవసరం. ఈ నిర్ణయం అమలుతో ఆంగ్లభాష నేర్చుకోవడం ఆలస్యం కావచ్చు. ఇలాంటి కొన్ని కీలక సవాళ్లను మనం సరిగా పరిష్కరించుకోగలిగితే.. ఈ విధానం విజయవంతంగా అమలు చేయవచ్చు.

– తనూజ, ప్రిన్సిపాల్‌, పల్లవి మోడల్‌ స్కూల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement