
ఇంకుడు గుంతలు..కళ్లకు గంతలు!
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో భవన (ఇళ్ల) నిర్మాణంలో భాగంగా ఇంకుడుగుంతలు తవ్వుతున్న వారే కొందరు. వారిలోనూ చాలామంది కేవలం ఓసీ (ఆక్యుపెన్సీ సర్టిఫికెట్) పొందేందుకు మాత్రం తూతూమంత్రంగా ఇంకుడుగుంతలున్నట్లు చూపుతున్నప్పటికీ, అనంతరం చాలామంది వాటి నిర్వహణను పట్టించుకోవడం లేదు. దీంతో ఉన్న ఇంకుడు గుంతలు సైతం కాగితాల్లో తప్ప వాటితో ఎటువంటి మేలూ జరగడం లేదు. వర్షపు నీరు భూమి లోపలికి వెళ్లడం లేదు. దీనికంతటికీ కారణం అధికారుల అశ్రద్ధ, పర్యవేక్షణ లేకపోవడమే. గత ఐదేళ్లలో జీహెచ్ంసీ 69,575 భవన నిర్మాణాలకు అనుమతులివ్వగా, అందులో ఇంకుడు గుంతలు నిర్మించింది 23,239 భవనాల్లోనే. అంటే 33.40 శాతమే. ఓవైపు భూగర్భ జలాలు అడుగంటకుండా కాపాడేందుకు, మరోవైపు వర్షాలొచ్చినప్పుడు నాలాలు పొంగిపొర్లి రోడ్లు, కాలనీలు మునిగిపోకుండా ఉండేందుకు ప్రభుత్వం 100 చదరపు మీటర్ల కంటే ఎక్కువ స్థలంలో నిర్మించే అన్ని ఇళ్లకు ఇంకుడుగుంతల నిర్మాణాన్ని తప్పనిసరి చేసింది.
ఓసీల కోసమే..
● వాల్టా చట్టం మేరకు 200 చదరపు మీటర్ల కంటే ఎక్కువ స్థలంలో భవనాలకు ఓసీ జారీ చేసేముందు నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి, ఇంకుడుగుంత ఉంటేనే ఓసీ ఇవ్వాలని స్పష్టం చేసింది. లేని పక్షంలో ఓసీ ఇవ్వొద్దని పేర్కొంది. ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరం (2024–25)లో జీహెచ్ఎంసీ 11,509 భవన నిర్మాణాలకు అనుమతులు జా రీ చేయగా, వాటిలో 4,578 భవన నిర్మాణదారులు మాత్రమే ఇంకుడు గుంతలు నిర్మించారు.
● వారిలో 2,036 మంది ఓసీలు పొందారు. అలా గడచిన ఐదేళ్లలో 1,0001 మంది మాత్రమే ఓసీలు పొందారు. నీటి వనరులు, భూమి, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం వాల్టా చట్టాన్ని తెచ్చినప్పటికీ, అమలులో అటు అధికారులు, ఇటు ప్రజలు శ్రద్ధ చూపడం లేదు. 200 చదరపు మీటర్ల కంటే తక్కువ స్థలం, ఏడు మీటర్ల లోపు భవనాలకు ఓసీల అవసరం లేకుండా మినహాయింపు ఇచ్చారు. ఇతరులకు అమ్ముకోవాలనుకున్నప్పుడు, లేక బ్యాంకు రుణం అవసరమైప్పుడు చూపించేందుకు మాత్రమే ఓసీలు తీసుకుంటున్నవారూ ఉన్నారు.
గత ఐదేళ్లలో జీహెచ్ఎంసీలో ఇళ్ల నిర్మాణాలు, ఇంకుడు గుంతలు ఇలా..
ఆర్థిక భవన ఓసీలు ఇంకుడు
సంవత్సరం అనుమతులు జారీ గుంతలు
2020–21 12,306 1,216 5,378
2021–22 17,604 1,606 3,284
2022–23 14,665 2,560 4,881
2023–24 13,491 2,683 5,218
2024–25 11,509 2,036 4,578
మొత్తం 69,575 10,001 23,239
ఓసీలు పొందే వరకే పరిమితం..
ఆ తర్వాత పట్టించుకోని వైనం
ఐదేళ్లలో తవ్వినవి 33 శాతమే
69 వేలకుగాను 23వేల ఇళ్లలోనే..
వాటికి సైతం కొరవడిన నిర్వహణ
బల్దియాలో భూగర్భజలాలు పెరిగేదెలా?