
ఉత్తమ మహిళలకు అవార్డులు
సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో నగరంలోని అహిల్యా ఉమెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ మహిళకు అవార్డులను అందించారు. ఇందులో భాగంగా నారాయణగూడ వేదికగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘విద్య, సంగీతం, సామాజిక’ రంగాల్లో విశేషంగా కృషి చేసిన సింగర్ వ్రిందావన నాయల్కల్కర్, సమాజ సేవకురాలు గీతా మిశ్రా, హెడ్ మినిస్టర్ వైశాలి కులకర్ణిలకు ఉత్తమ మహిళ అవార్డులను అందించారు. ఈ కార్యక్రమంలో డా.పూనమ్ నోముల్వార్, అంజలి పోపలే, నాగమణి రెడ్డి, డా.ప్రాచి బన్సాల్లు ముఖ్యఅతిథులుగా పాల్గొని అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తమ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిరంతరం మహిళల కోసం నైపుణ్య శిక్షణ శిబిరాలను, మహిళా సాధికారత సహకార కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సామాజిక సేవలో భాగంగా ప్రతి నెలా అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఉమెన్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రొమ్ము కేన్సర్, టెర్రస్ గార్డెన్ పైన అవగాహన కల్పించామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు సంతోష్అగర్వాల్, గీతిక, స్మితా వాల్వేకర్, పాయల్ జైన్, రష్మీ పాల్గొన్నారు.