భారత్‌ దాకా | - | Sakshi
Sakshi News home page

Mar 8 2023 2:58 AM | Updated on Mar 8 2023 2:58 AM

- - Sakshi

బంకర్ల నుంచి..

భౌగోళిక అంతరాలు దాటి చదువుకుందామని వెళ్లిన యువత...బాంబుల మోతలకు భీతిల్లి బంకర్లలో ఇరుక్కున్నారు. రోగాలపై యుద్ధం చేస్తున్న వారిని కాపాడే పట్టా పుచ్చుకుందామనుకున్న రేపటి వైద్యులే కాపాడండి అంటూ యుద్ధభూమి నుంచి ఆక్రందనలు చేశారు. వారంతా క్షేమంగా తిరిగివచ్చిన మాట నిజమే కానీ అది అంత సులువుగా జరిగిపోలేదు. ఉక్రెయిన్‌ యుద్ధం మొదలై గత నెల చివరకు ఏడాది కాగా చివరి వైద్య విద్యార్ధి తరలింపు పూర్తయి మార్చి 8కి ఏడాది. ఈ నేపథ్యంలో విద్యార్థుల తరలింపులో కీలకపాత్ర పోషించి తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా ప్రముఖుల ప్రశంసలు పొందారు నగర వైద్యురాలు, నియో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ సీఈఓ డాక్టర్‌ దివ్యారాజ్‌రెడ్డి. ‘వైద్య విద్యాభ్యాసం కోసం ఉక్రెయిన్‌కు వెళ్లేవారిలో అత్యధికులు మధ్యతరగతివారే. అలాంటి వారందరూ రష్యా–ఉక్రెయిన్‌ వార్‌ సమయంలో తిరిగి క్షేమంగా ఇండియాకు చేరగలమా అని తీవ్రమైన భయాందోళనలకు గురయ్యారు’ అంటూ గుర్తు చేసుకున్నారు దివ్యారాజ్‌రెడ్డి. ఆమె చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే..

ప్రాణాలు అరచేత.. రైలు కూత..

యుద్ధం ప్రారంభమైంది. మన విద్యార్ధులు అక్కడి బంకర్స్‌లో బిక్కుబిక్కుమంటూ తలదాచుకున్నారు. సరిహద్దుల వరకూ విద్యార్థులు వస్తే అక్కడ నుంచి భారత్‌కి రావడానికి భారతీయ విమానాలు సిద్ధంగా ఉన్నాయి. కానీ.. సరిహద్దు వరకూ రావడం ఎలా? వాహనాలేవీ తిరగలేని పరిస్థితిలో దాదాపు 24 గంటల ప్రయాణం ఏ మార్గంలో చేయాలి? ఈ ప్రశ్నలకు నాకో పరిష్కారం తట్టింది. విద్యార్థుల్ని రైలు ద్వారా తీసుకువెళ్లడానికి నా శక్తియుక్తులన్నీ ఉపయోగించాను. దశాబ్దానికి పైగా ఉక్రెయిన్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌కు ఇండియన్‌ రాయబారిగా పలు హోదాల్లో పని చేసిన అనుభవాన్ని, సంబంధాల్ని పణంగా పెట్టాను. ఎట్టకేలకు ప్రత్యేక రైలుకు గ్రీన్‌ సిగ్నల్‌ పడింది. సరిహద్దుకు దగ్గరగా ఉన్న స్టేషన్‌ వరకూ ట్రైన్‌ సెట్‌ అవగానే విద్యార్థుల్ని క్యాంపస్‌కు రమ్మని సమాచారం ఇచ్చాం. అందరూ కలిపి దాదాపు 2000 మంది అత్యధికంగా 50 మంది పట్టే పెట్టెలో 150 మంది చొప్పున కుక్కాం. ప్రయాణ సమయంలో ఆరోగ్య సమస్యలు వస్తే ఎలా అందుకే 5 గంటల తేడాలో మరో రైలు ఏర్పాటు చేశాం. ఆన్‌లైన్‌ ద్వారా కంటిన్యూగా టచ్‌లో ఉంటూ మానిటర్‌ చేశాం. చివరి స్టేషన్‌ అయిన హంగేరీలో దాదాపు 16 గంటల పాటు షెల్టర్‌ కోసం వెతకడం మరో చాలెంజ్‌.. దాన్ని కూడా అధిగమించి ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్నాం.

రెస్క్యూపై డాక్యుమెంటరీ...

ఓ అంతర్జాతీయ సంస్థ ఉక్రెయిన్‌ టూ ఇండియా వరకూ విద్యార్ధుల ప్రయాణాన్ని, ముఖ్యంగా సరిహద్దుల దాకా ట్రైన్‌ జర్నీని ప్రధానంగా తీసుకుని రెస్క్యూ పేరిట ఒక డాక్యుమెంటరీ రూపొందిస్తున్నారు. ఇటీవలే ఆ చిత్రం కోసం దివ్యారాజ్‌రెడ్డిని కలిశారు.

‘పట్టా’లెక్కించారు...

అనేక భయాందోళనల మధ్య ఉక్రెయిన్‌ నుంచి హఠాత్తుగా పారిపోవాల్సిన అవసరం ఏర్పడిన సంవత్సరం తర్వాత ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్న విద్యార్ధులు ఆ చేదు జ్ఞాపకాల నుంచి త్వరగానే కోలుకున్నారు. రెట్టించిన ఉత్సాహంతో చదువుకుని డిగ్రీ పూర్తి చేసుకున్నారు. గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్‌లో సోమవారం ఏర్పాటు చేసిన స్నాతకోత్సవంలో 70 మంది వైద్య విద్యార్థులు తమ ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామినేషన్‌ పట్టాలను అందుకోవడం గమనార్హం.

ఉక్రెయిన్‌ నుంచి విద్యార్థుల తరలింపు

రెస్క్యూలో కీలక పాత్ర పోషించిన డాక్టర్‌ దివ్యారాజ్‌రెడ్డి

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement