● మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్
హన్మకొండ: కార్మికుల హక్కుల కోసం పోరాడుదామని మాజీ ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కార్మిక సంఘాల నాయకులతో కలిసి కార్మిక హక్కుల చైతన్య మాసోత్సవ సదస్సు వాల్పోస్టర్లను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు ఎనిమిదేళ్లుగా ఉద్యోగ, కార్మికుల హక్కుల సాధన, రక్షణ కోసం మే నెలలో కార్మిక మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది ఉద్యోగ, కార్మిక హక్కుల చైతన్య మాసోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఉద్యోగులు, కార్మికుల హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భారత రాష్ట్ర సమితి ట్రేడ్ యూనియన్ నాయకుడు నాయిని రవి మాట్లాడుతూ గిగ్ వర్కర్లకు కార్మిక చట్టాలను వర్తింపజేసి, సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో త్రిచక్ర ఆటో సహకార సంఘం అధ్యక్షుడు ఈసంపల్లి సంజీవ, ఆయా కార్మిక సంఘాల నాయకులు రాజు, గొర్రె విజయ్, ఇస్మాయిల్, దూలం వెంకన్న, పున్నంచందర్, ఖలీల్, సదానందం, పానుగంటి శ్రీధర్, మహేందర్, శ్రీధర్ రెడ్డి, బాబు, శ్రీలత, విజయ, లక్ష్మి పాల్గొన్నారు.


