విద్యారణ్యపురి: ఎన్టీఏను రద్దుచేసి నీట్ అభ్యర్థులకు న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు హనుమకొండలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు స్టాలిన్ మాట్లాడుతూ నీట్ను పకడ్బందీగా నిర్వహించడంలో ఎన్టీఏ విఫలమైందని విమర్శించారు. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కేయూ అధ్యక్షుడు బీరెడ్డి జస్వంత్, బాధ్యులు నాగరాజ్ కుమార్, రవి, తదితరులు పాల్గొన్నారు.
సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి
కాశిబుగ్గ: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు ఒక ప్రకటనలో తెలిపారు. నీట్ పేరుతో 23లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడడం దుర్మార్గమని పేర్కొన్నారు. అనేక వ్యయ ప్రయాసాలకు గురై కష్టపడి చదివిన విద్యార్థులకు తీరని నిరాశ మిగిలిందని తెలిపారు. నిపుణులు సూచించిన విధంగా ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించాలని ఆయన సూచించారు.


