హన్మకొండ చౌరస్తా : చిన్నారుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సృజనాత్మకతను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ‘బాలమంగళం’ బాలబాలికల వేసవి శిక్షణ శిబిరం బుధవారం ముగిసింది. ఈనెల 5వ తేదీన ప్రారంభమైన శిబిరం 9 రోజుల పాటు విద్యార్థుల ఉత్సాహభరిత భాగస్వామ్యంతో కొనసాగింది. ఈ సందర్భంగా హనుమకొండ కాకాజీ కాలనీలోని శ్రీ వివేకానంద యోగా కేంద్రంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి మాధవ స్మారక సమితి అధ్యక్షుడు కోదాటి సుధాకర్ రావు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా ఎంజీఎం రిటైర్డ్ ఆర్ఎంఓ, ఆర్ఎస్ఎస్ వరంగల్ మహానగర్ సంఘచాలక్ డాక్టర్ బందెల మోహన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలబాలికల్లో భారతీయ సంస్కృతి, సభ్యతను పెంపొందింపజేస్తున్న మాధవస్మారక సమితికి అభినందనలు తెలిపారు. నేటి డిజిటల్ యుగంలో పిల్లలకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, శారీరక దృఢత్వం పట్ల అవగాహన కల్పించడమే ఈ శిబిరం ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ సందర్భంగా బాలబాలికలు ప్రదర్శించిన యోగాసనాలు, సైన్స్ ప్రదర్శనలు హాజరైన వారిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది లెక్కల జలంధర్ రెడ్డి, మాధవస్మారక సమితి ప్రధాన కార్యదర్శి దాస్యం రామానుజం, కుటుంబ ప్రబోధన్ వరంగల్ విభాగ్ సంయోజక్ ఆర్.లక్ష్మణ్ సుధాకర్, విజ్ఞాన భారతి రాష్ట్ర కన్వీనర్ సత్తు రామనాథం, సంస్కృత భారతి పేట శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
9 రోజుల పాటు ఉత్సాహంగా కొనసాగిన క్యాంపు


