నేరస్తులకు మూడేళ్ల జైలు
వరంగల్ లీగల్ : బాలికను వ్యంగ్య మాటలు, వెకిలి చేష్టలతో వేధింపులకు గురి చేస్తూ చంపుతామని బెదిరింపులకు పాల్పడిన ఘటనలో నేరం రుజువుకావడంతో హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కనిపర్తి గ్రామానికి చెందిన పస్తం అరవింద్, తూర్పాటి రాజుకు మూడేళ్ల జైలు శిక్ష, రూ. 2 వేల చొప్పున జరిమానా విధిస్తూ హనుమకొండ జిల్లా మొదటి అదనపు కోర్టు జడ్జి బి.అపర్ణాదేవి మంగళవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. కనిపర్తి గ్రామానికి చెందిన ఓ బాలిక 8వ తరగతి చదువుకుంటోంది. సదరు బాలిక పాఠశాలకు వెళ్తున్న సమయంలో, ఇంట్లో ఒంటరిగా ఉన్న సందర్భంలో అదే గ్రామానికి చెందిన అరవింద్, రాజు మానసికంగా వేధించేవారు. ఈ విషయాన్ని బాలిక తన తండ్రికి తెలియజేయగా గ్రామ పెద్ద మనిషి ద్వారా ఇరువురిని పిలిచి మందలించారు. అయినా వారి తీరులో ఎలాంటి మార్పు లేదు. ఈ క్రమంలో 2022, ఏప్రిల్ 27న బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అరవింద్, రాజు మరోసారి వచ్చి అదే రీతిలో ప్రవర్తించగా స్పందించింది. దీంతో ఈ విషయం ఎవరికై నా చెబితే చంపుతామని బెదిరించారు. ఈ ఘటనను బాలిక తన తండ్రికి చెప్పింది. దీంతో బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కమలాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు అరవింద్, రాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారణలో నేరం రుజువుకావడంతో నేరస్తులు అరవింద్, రాజుకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.2 వేల చొప్పున జరిమానా విధిస్తూ జడ్జి అపర్ణాదేవి తీర్పు వెలువరించారు. కేసును సీఐ పి.నవీన్, ఎస్సై ప్రవీణ్కుమార్ పరిశోధించగా, లైజన్ ఆఫీసర్ కె.పరమేశ్వరీ, భరోసా న్యాయ అధికారి సి.హెచ్ నీరజ విచారణ పర్యవేక్షించారు. సాక్షులను కానిస్టేబుల్ ఎం.హరీశ్ కోర్టులో ప్రవేశపెట్టగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.రాజమల్లారెడ్డి కేసు వాదించారు.


