ఏడాది ఎదురుచూసుడే! | - | Sakshi
Sakshi News home page

ఏడాది ఎదురుచూసుడే!

Apr 8 2026 8:26 AM | Updated on Apr 8 2026 8:26 AM

ఏడాది ఎదురుచూసుడే!

‘కేంద్ర ప్రభుత్వం 2027 మార్చి 31 వరకు జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దులు మార్చవద్దని గడువు విధించింది. అది ముగిసిన తర్వాత జ్యుడీషియల్‌ కమిషన్‌ వేసి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తాం’

– ఆదిలాబాద్‌ జిల్లాలోని పిప్రీ

బహిరంగసభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

సాక్షి, వరంగల్‌: అశాసీ్త్రయంగా ఏర్పడిన హనుమకొండ, వరంగల్‌ జిల్లాలను కలిపి వరంగల్‌ జిల్లాగా ఏర్పాటు చేయాలని కొన్నాళ్లుగా ఉద్యమం ఊపందుకుంటోంది. ఈ తరుణంలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో మరో ఏడాది ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్రం విధించిన గడువు ఏడాది, ఆతర్వాత కమిషన్‌ ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక ఇచ్చేందుకు మరో ఏడాది. ఇలా ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేందుకు రెండేళ్లు పట్టే అవకాశం ఉంది. కాగా, రెండున్నరేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్‌ రెడ్డి నోటి నుంచి వచ్చిన అశాసీ్త్రయ జిల్లాల విభజన అంశం 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమయ్యే అవకాశం ఉంది.

ముక్కలైన చారిత్రక నగరం..

వరంగల్‌ కలెక్టరేట్‌తో పాటు ఇతర కీలక కార్యాలయాలన్నీ హనుమకొండలో ఉన్నాయి. వరంగల్‌ జిల్లా వాసులు కలెక్టర్‌ను కలవాలంటే హనుమకొండకు రావాల్సిన పరిస్థితి. వరంగల్‌, హనుమకొండ, కాజీపేటతో కలిపి ట్రైసిటీగా పిలవబడే ఈ చారిత్రక నగరాలను గత ప్రభుత్వం రెండు ముక్కలు చేయడంపై నిరసన వ్యక్తమవుతోంది. గతేడాది కాలంగా వరంగల్‌, హనుమకొండ జిల్లాలను కలిపి వరంగల్‌ జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈనేపథ్యంలో కాకతీయ యూనివర్సిటీ ఫ్రొఫెసర్లు, విద్యార్థులు, విద్యావంతులు, వివిధ పార్టీల నేతలు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ ఉద్యమ వేదిక, ఫోరం ఫర్‌ బెటర్‌ వరంగల్‌ ఆధ్వర్యంలో సదస్సులు, చర్చా వేదికలు నిర్వహిస్తున్నారు. కాగా, ఈ అంశం గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల వేళ అధికార పార్టీకి చిక్కులు తేవొచ్చన్న చర్చ జరుగుతోంది. కాగా, రెండు జిల్లాల ప్రజల మద్దతు కూడగట్టేలా సదస్సులు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కేయూ ప్రొఫెసర్లు చెబుతున్నారు.

పూర్వపు జిల్లాను సాధిస్తాం..

గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు రెండు జిల్లాల పరిధిలో జరగనున్నాయి. విడగొట్టిన చారిత్రక నగరాన్ని కలపాలనే డిమాండ్‌ ఇప్పటికే వినిపిస్తున్నాం. రాబోయే ఈ బల్దియా ఎన్నికల్లో ఈ నినాదాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఈ ట్రైసిటీని కలిపి వరంగల్‌ జిల్లాగా ఏర్పాటు చేసేందుకు మద్దతివ్వాలని అన్ని పార్టీలపై ఒత్తిడి తీసుకొస్తాం. మాకు మద్దతిచ్చిన వారికి ఓటు వేయాలని బహిరంగంగా ప్రజలకు కూడా చెబుతాం. మా ఏకై క లక్ష్యం విడిపోయిన చారిత్రక నగరాన్ని కలిపి వరంగల్‌ జిల్లాగా చేయడమే. ఇతర సంఘాలు, ప్రొఫెసర్లు, మేధావులను కలుపుకొని ముందుకెళ్లి పూర్వపు జిల్లాను సాధిస్తాం.

– పుల్లూరు సుధాకర్‌, అధ్యక్షుడు,

ఫోరమ్‌ ఫర్‌ బెటర్‌ వరంగల్‌

హనుమకొండ, వరంగల్‌ ఇప్పట్లో కలవడం కష్టమే!

2027 మార్చి 31 తర్వాత

జ్యుడీషియల్‌ కమిషన్‌ ఏర్పాటు

కేంద్రం గడువు విధించినట్లు స్పష్టం చేసిన సీఎం రేవంత్‌ రెడ్డి

మరోవైపు ఏడాదిగా ఉద్యమం ఉధృతం

రెండు జిల్లాల పరిధి కార్పొరేషన్‌

ఎన్నికల్లో కీలకమయ్యే చాన్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement