
పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలి
● బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ తిరునహరి శేషు
హన్మకొండ : ఎలాంటి షరతులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ తిరునహరి శేషు డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ సాధనకు, కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో తిరునహరి శేషు మాట్లాడుతూ..ఫీజు రీయింబర్స్మెంట్పై ఆంక్షలు పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ విద్యార్థులకు అన్యాయం చేస్తే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని హామీ ఇచ్చి అమలు చేయకుండా మోసం చేస్తోందని దుయ్యబట్టారు. బీసీ నాయకులు నూతనకంటి ఆనందం, పాలడుగు సురేందర్ మాట్లాడుతూ పూలే విదేశీ విద్యా జ్యోతి పథకం ద్వారా విదేశాలకు వెళ్లే బీసీ విద్యార్థుల సంఖ్యను 300 నుంచి 800కి పెంచే ప్రతిపాదన ఫైల్ వెంటనే సంతకం చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు డాక్టర్ ఎర్ర బొజ్జు రమేష్, చిన్నాల యశ్వంత్ యాదవ్, బండి డేనియల్, నేదునూరి రాజమౌళి, బుట్టి శ్యామ్ యాదవ్, దారా జనార్దన్, ఆకారపు మోహన్, కేడల ప్రసాద్, తాడిశెట్టి క్రాంతి, హైమావతి, బేబీ పాల్గొన్నారు.