
ఉత్సాహంగా ఒలింపిక్ డే రన్
వరంగల్ స్పోర్ట్స్: అంతర్జాతీయ ఒలింపిక్ డే ను పురస్కరించుకొని వరంగల్ ఒలింపిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఆదివారం నిర్వహించిన రన్లో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని కాళోజీ విగ్రహం వద్ద అసోసియేషన్ జిల్లా చైర్మన్ జంగా రాఘవరెడ్డి జెండా ఊపి రన్ను ప్రారంభించారు. ఒలింపిక్ టార్చ్తో కాళోజీ విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం మీదుగా జవహర్లాల్ నెహ్రూ స్టేడియానికి చేరుకున్నారు. ఈసందర్భంగా నిర్వహించిన ముగింపు స మావేశంలో జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ తల్లి దండ్రులు తమ పిల్లలకు ఆస్తులకు బదులు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేందుకు క్రీడల్లో భాగస్వాములను చేయాలని సూచించారు. విద్యార్థి దశ నుంచి క్రీడలపై ఆసక్తి పెంచాలని, దురదృష్టవశాత్తు అత్యధిక శాతం పాఠశాలలు, కళాశాలలకు కనీస మైదానాలు లేకపోవడం శోచనీయమన్నారు. మైదానాలున్న విద్యాసంస్థలకు మాత్రమే అనుమతిస్తూ వ్యాయామ ఉపాధ్యాయులను తప్పనిసరి నియమించుకునేలా ఆదేశాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం క్రీడా రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని, స్వతహాగా క్రీడాకారుడైన సీఎం నేతృత్వంలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా క్రీడలు, యువజన అధికారి గుగులోత్ అశోక్కుమార్, వరంగల్ ఒలింపిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎండీ.అజీజ్ ఖాన్, మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, శ్యామల పవన్కుమార్, డాక్టర్ పి.రమేశ్రెడ్డి, తోట శ్యాంప్రసాద్, మహ్మద్ కరీం, రామప్ప అకాడమీ చైర్మన్ చంద్రమోహన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.