విచారంలో నృత్యకళాకారులు
తెనాలి: పట్టణానికి చెందిన ప్రముఖ నాట్యాచార్యుడు, నాట్యగురువు ‘దేవపారిజాతం’ అవార్డు గ్రహీత ఎండీ గిరి (80) మృతిచెందారు. వారం రోజుల కిందట అనారోగ్యానికి గురైన గిరి, స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందారు. కళాకారులు, నృత్యకళాకారుల సందర్శనార్ధం ఆయన భౌతికకాయాన్ని బీసీ కాలనీలోని పట్టణ రంగస్థల కళాకారుల భవనంలో ఉంచారు. ప్రముఖ నృత్యకళాకారులు/నృత్యగురువులు భాస్కర్ల రంగనాయకి, జంధ్యాల వేదవల్లి, జంధ్యాల రామచంద్రమూర్తి, ఆలపాటి ప్రజ్ఞ తదితరులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సాయంత్రం ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలను నిర్వహించారు. ఎండీ గిరి పూర్తిపేరు దస్తగిరి. అనంతపురం జిల్లా బోగాలకట్ట స్వగ్రామం. 1986లో తెనాలి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. తాను స్థాపించిన శ్రీగిరిజా ఆర్ట్ అకాడమీ ద్వారా ఎందరికో నృత్యశిక్షణనిచ్చారు. దేశీయ నృత్యరీతులు, వాటి వైశిష్ట్యాన్ని వ్యాప్తి చేసేందుకు గత నాలుగు దశాబ్దాలుగా విశేష కృషిచేశారు. ఎన్నో నృత్యరూపకాలను రూపొందించి ప్రదర్శింపజేశారు.


