సాక్షి, తాడేపల్లి: దేశంలో అతిపెద్ద స్కామ్ అమరావతి క్యాపిటల్ అని చెప్పుకొచ్చారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. అమరావతి ప్రజల రాజధాని కాదు.. కుంభకోణాల రాజధాని అని ఆరోపించారు. అమరావతి టెండర్లలో గూడుపుఠాణీ జరిగింది? మాఫియాగా ఏర్పడ్డారు అని అన్నారు. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీకి 1100 కోట్లు వృథా చేశారని తెలిపారు. అమరావతికి ఎవరూ వ్యతిరేకం కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు.
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘అమరావతిలో భయంకరమైన అవినీతి, దోపిడీ జరుగుతోంది. దేశంలో అతిపెద్ద స్కామ్కు అమరావతి క్యాపిటల్. అమరావతి ప్రజల క్యాపిటల్ కాదు.. స్కామ్ల రాజధాని. అమరావతి టెండర్లలో గూడుపుఠాణీ జరిగింది? మాఫియాగా ఏర్పడ్డారు. 2018లో ఏ పనులు, ఎవరు చేశారో, 2024లో టెండర్లు రద్దు చేసిన తర్వాత కూడా మళ్లీ అవే కంపెనీలకు పనులు దక్కాయి. ఒకవైపున అనూహ్యంగా రేట్లు పెంచి, మరో వైపున టెండర్లు రిగ్ చేశారు. ల్యాండు ఫ్రీ, ఇసుక ఫ్రీ, కరెంటు ఛార్జీల్లో రాయితీలు, జీఎస్టీ మినహాయింపు, సీనరేజీ మినహాయింపు, ఎన్ఏసీ మినహాయింపు ఇస్తున్నారు.
ఇవన్నీ ఉన్నాసరే ఎస్ఎఫ్టీ చదరపు అడుగుకు రూ.11వేల నుంచి రూ.14వేలు చూపిస్తున్నారు. ప్రజల రాజధాని సంగతి దేవుడెరుగు అతిపెద్ద స్కాంకు, కరప్షన్కు చంద్రబాబు నిజంగానే క్యాపిటల్ చేసేశాడు. బెంగళూరు, హైదరాబాద్లాంటి మహా నగరాల్లో ఫైవ్ స్టార్ సదుపాయాలతో చదరపు అడుగుకు రూ.4,500 దాటదు. కానీ, అమరావతిలో టవర్-1కు 2018లో టెండర్ విలువ రూ.932 కోట్లు. కాంట్రాక్టర్కు అన్ని మినహాయింపులు ఇచ్చి టెండర్ పెంచారు. మొత్తం కాంట్రాక్ట్ విలువ 1762 కోట్లకు పెంచారు. టవర్-2కు 2018లో టెండర్ విలువ 762 కోట్లు. ఇప్పుడు అన్ని మినహాయింపులు ఇచ్చి 1545 కోట్లకు పెంచారు. జీఏడీ టవర్.. 2018లో కాంట్రాక్ట్ విలువ 554 కోట్లు. ఇప్పుడు జీఏడీ టవర్ పనులను రూ.1046 కోట్లకు పెంచేశారు.

ఐదు టవర్లకు చదరపు అడుగుకు రూ.14795 ఖర్చు చేస్తున్నారు. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీకి 1100 కోట్లు వృథా చేశారు. తెలంగాణ సచివాలయాన్ని కేసీఆర్ రూ.615 కోట్లతో కట్టారు. ఢిల్లీలో పార్లమెంట్ కొత్త భవనం రూ.970 కోట్లతో కట్టారు. మళ్లీ అసెంబ్లీ అంటూ రూ.1149 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మళ్లీ హైకోర్టు అంటూ రూ.1480 కోట్లు ఖర్చు చేస్తున్నారు. స్కామ్ల కోసం హైకోర్టు, అసెంబ్లీలను కూడా వదలడం లేదు. అసెంబ్లీ డిజైన్ల కోసం రూ.401 కోట్లు ఖర్చు చేశారు. మురుగు కాల్వల నుంచి వరదల వరకు ప్రతీచోటా బాబు అవినీతి జరిగింది. కొండవీటి వాగు-వారధి వరకు ఫ్లైఓవర్కు కిలోమీటర్కి 170 కోట్లా?. మా హయాంలో ఫ్లైఓవర్ల కోసం కిలోమీటర్కి రూ.35 కోట్లు ఖర్చు చేశాం. అమరావతిలో కి.మీకి 53 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అమరావతికి ఎవరూ వ్యతిరేకం కాదు’ అని అన్నారు.


