లోపించిన ప్రణాళిక
ఆర్ అండ్ బీ, కార్పొరేషన్ అధికారుల బెదిరింపులు హైకోర్టును ఆశ్రయించిన వ్యాపారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశం నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన అడ్వకేట్ కమిషనర్ ఆనంద్కుమార్ అధికారుల తప్పిదాలను ఆయన దృష్టికి తీసుకెళ్లిన జేఏసీ నేతలు, వ్యాపారులు
ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో నిబంధనలకు తిలోదకాలు
ఫ్లై ఓవర్ నిర్మాణంలో
గుంటూరు ఎడ్యుకేషన్: శంకర్ విలాస్ వద్ద ఫ్లైఓవర్ పునర్నిర్మాణంలో నిబంధనలు గాలికొదిలేసిన అధికార యంత్రాంగం తీరుపై దాఖలు చేసిన పిటిషన్లపై క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసేందుకు హైకోర్టు నియమించిన అడ్వకేట్ కమిషనర్ ఎం.ఆనంద్కుమార్ ఆదివారం గుంటూరులో పర్యటించారు. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కూల్చివేత మొదలు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితోపాటు ఆర్ అండ్ బీ, నగర పాలక సంస్థ యంత్రాంగాలు ఎవరిష్టం వచ్చినట్లు వారు నిర్మాణ ప్లాన్ను మార్చివేసి, సర్వీసు రోడ్లు లేకుండా చేయడంతోపాటు దుకాణాలను కోల్పోతున్న వ్యాపారులకు చెల్లించాల్సిన నష్టపరిహారంపై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు, వ్యాపారులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా గుంటూరు నగరంలో ఏర్పడిన తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలపై దృష్టి సారించి, న్యాయం చేయాలని దాఖలైన పిటిషన్ల విచారణకు ముందుగా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని హైకోర్టు నియమించిన అడ్వకేట్ కమిషనర్ ఎం.ఆనంద్కుమార్ అరండల్పేట, బ్రాడీపేట, ఏసీ కళాశాల వైపు ఫ్లైఓవర్ నిర్మాణ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ నిర్మాణం కారణంగా దుకాణాలు కోల్పోతున్న వ్యాపారులతో నేరుగా మాట్లాడారు. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ సాధన జేఏసీ కన్వీనర్ ఎల్.భారవి, వ్యాపారుల సంఘ ప్రతినిధులు కమల్కాంత్, బొల్లంకొండ శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ ఈచంపాటి వెంకట కృష్ణమాచారి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, అధికారుల నిర్లక్ష్య వైఖరిని కళ్లకు కట్టినట్లుగా ఆయనకు చూపించారు.
అడ్వకేట్ కమిషనర్
అధ్యయనం చేసిన అంశాలు
శంకర్విలాస్ ఫ్లైఓవర్ కూల్చివేత, నిర్మాణ పనుల్లో అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తు ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అధికారులు సమస్యను మరింత జటిలం చేస్తున్నారు. కోర్టుకు వెళ్లిన వారిపై టౌన్ ప్లానింగ్ అధికారులు బెదిరింపులకు దిగుతున్నారు. గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించి, ప్రజల ఇబ్బందులను తొలగించే విధంగా ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టాలి. బ్రిడ్జి నిర్మాణానికి రైల్వేశాఖ నుంచి అనుమతి రాకముందే హడావుడిగా వినియోగంలో ఉన్న బ్రిడ్జి కూల్చివేసిన కారణంగా నాలుగు నెలలుగా ప్రజలు నరకం చూస్తున్నారు. నూతన ఫ్లైఓవర్ నిర్మాణానికి పిల్లర్లు రోడ్డుకు అడ్డంగా ఉంటున్నాయి. ఫ్లైఓవర్ నిర్మాణం తరువాత బ్రాడీపేట ఒకటో లైనులోకి వెళ్లే అవకాశం లేకుండా చేస్తున్నారు. ఫ్లైఓవర్ ప్లాన్ను బహిరంగ పర్చాలని కోరితే ప్రజాప్రతినిధులకే తెలియకుండా రహస్యంగా ఉంచుతున్నారు. పైస్థాయిలో ప్రజా ప్రతినిధులు, అధికారులు ఏకపక్షంగా ముందుకు వెళ్తున్న కారణంగా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
– ఈచంపాటి వెంకటకృష్ణమాచారి, కార్పొరేటర్
లోపించిన ప్రణాళిక


