మనసారా.. శివనామస్మరణ
భక్తులతో కిటకిటలాడిన కాకాని శివాలయం కార్తిక దీపాలు వెలిగించి పూజలు చేసిన భక్తులు ఒక్కరోజులో వివిధ రూపాల్లో ఆలయ ఆదాయం రూ.8.50 లక్షలు
పెదకాకాని: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానం కార్తిక మాసాన్ని పురస్కరించుని హరోం హర నామస్మరణతో మార్మోగింది. పెదకాకాని శివాలయంలో తెల్లవారుజామున సుప్రభాతసేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కార్తిక మాసం 4వ ఆదివారం వేకువజామున భక్తులు యజ్ఞాల బావి వద్ద స్నానాలు చేసి, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ప్రాంగణం కళకళలాడింది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున చేరుకున్న భక్తులు ప్రాంగణంలో కార్తిక దీపాలు వెలిగించారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. యజ్ఞాల బావి నీటితో పొంగళ్లు పొంగించిన భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి భ్రమరాంబ మల్లేశ్వరస్వామిని దర్శించుకుని నైవేద్యం సమర్పించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ పర్యవేక్షణలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. స్వామివారి దర్శనం సకాలంలో జరిగేలా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు పాలు, మజ్జిగ, తాగునీరు అందించారు. అంతరాలయ దర్శనాలు, అభిషేకాలు, ఏకవారాభిషేక పూజలు, అన్నప్రాశనలు, నామకరణలు, రాహుకేతు పూజలు అధికసంఖ్యలో జరిగాయి. ప్రభలతో ఆలయానికి చేరుకున్న భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఒక్కరోజులో స్వామి వారికి వివిధ సేవా కార్యక్రమాల ద్వారా రూ.8,50,000 ఆదాయం లభించినట్లు డీసీ తెలిపారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదాలు అందించామని పేర్కొన్నారు.
మనసారా.. శివనామస్మరణ
మనసారా.. శివనామస్మరణ


