ప్రత్తిపాడు: నల్ల బర్లీ పొగాకు సాగు చేసిన రైతుల పరిస్థితి దైన్యంగా ఉంది. తినీ, తినక ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర లేదు. అటు ఉన్న ధరకు తెగనమ్ముకోలేక.. ఇటు నిల్వ చేసుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేశారు. తీరా పంట చేతికొచ్చే సమయంలో ధర అమాంతంగా పడి పోయింది. కొనేందుకు కంపెనీలు ముందుకు రావడం లేదు.
పొగాకును ఏమి చేసుకోవాలో తెలియక అవస్థలు పడుతున్నారు. పంటను ఇంటికి తరలించలేక, ఎక్కడా నిల్వ చేయలేక ఇదిగో పొలాల్లోనే కట్టలు కట్టి, వానలకు తడవకుండా పొలాల్లోనే పట్టాలు కట్టి భద్రపరుచుకున్నారు. నల్లబర్లీకి ధర కాస్తంత పలకకపోతుందా..? ప్రభుత్వం అయినా స్పందించి కొనుగోలు చేయదా ? అన్న ఆశతో కళ్లలో ఒత్తులు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు.
1,38,874 క్వింటాళ్ల నిల్వ
ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రత్తిపాడు, పెదనందిపాడు, వట్టిచెరుకూరు, కాకుమాను, గుంటూరు రూరల్ మండలాల్లో 3,406 మంది రైతులు 11,704 ఎకరాల్లో నల్లబర్లీ సాగు చేశారు. 1,38,874 క్వింటాళ్ల నిల్వలున్నాయి. వ్యవసాయ వైకుంఠపాళిలో రైతును ఏటా ప్రకృతి విపత్తులు, ప్రభుత్వ వైఖర్లు నిత్యం అల్ల్లకల్లోలం చేస్తూనే ఉన్నాయి. అయినా, మళ్లీ తొలకరి వానలు రావడం, కాడెద్దుల గంటల సవ్వడులు పిలవడం, హాలికుడి హలం పట్టి మళ్లీ కోటి ఆశల నిచ్చెనలు ఎక్కుతూ భూమిలో కాలిడటం ఆపడు.
రైతుల పాలిట ‘పగా’కు