
సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ నరసింహారెడ్డికి అవార్డు ప్రద
లక్ష్మీపురం: తలాసీమియా రోగుల కోసం 2023, 2024 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లోని 50కి పైగా కేంద్రాల్లో భారీ రక్తదాన శిబిరాలు నిర్వహించిన సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సాధు నరసింహారెడ్డికి భారత రెడ్ క్రాస్ సొసైటీ ప్రతిష్టాత్మకమైన ‘కార్ల్ లాండ్స్టీనర్ ’అవార్డు అందజేసింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శనివారం గుంటూరు నగరంపాలెం లోని భారతీయ విద్యాభవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ నరసింహారెడ్డి నాయకత్వ నైపుణ్యం, సమాజం పట్ల ఆయనకున్న నిబద్ధతకు ఈ అవార్డు నిదర్శనంగా నిలిచిందని పేర్కొన్నారు. అవార్డు గ్రహీత నరసింహారెడ్డి మాట్లాడుతూ తమ సిబ్బంది ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా నెలకొల్పిన స్వచ్ఛంద రక్తదాన శిబిరాల్లో 2023లో 1,440 యూనిట్లు, 2024లో 4100 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు తెలిపారు. ఈ కృషికి గానూ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తనకు గుర్తింపు కల్పించాయని తెలిపారు. ఇప్పుడు ఈ అవార్డు అందుకోవడం ద్వారా రక్తదాన సేకరణలో తన బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు. రెడ్ క్రాస్ సంస్థ ప్రధాన కార్యదర్శి ఎ.కె.పరీద మాట్లాడుతూ రక్తదాన శిబిరాల ఏర్పాటు, సామాజిక సేవల్లో నరసింహారెడ్డి అందించిన అసాధారణ సేవలకు గుర్తింపుగా అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్థ ఉపాధ్యక్షులు పి.రామచంద్రరాజు, జీఎస్టీ అధికారులు నాగరాజు, రవికుమార్, ఈశ్వరరావు, గాదె శ్రీనివాసరెడ్డి, పూర్ణ సాయి, శాఖమూరి శ్రీనివాస్, బిల్లా ప్రశాంత్ కుమార్ పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
యడ్లపాడు: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురికి గాయాలయ్యాయి. హైవే పరిరక్షణ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం... బాపట్ల జిల్లా వలపర్ల గ్రామస్తులు మొహమ్మద్, హసీరా దంపతులు, వారి ఇద్దరు పిల్లలు నహీరా, నసీర్లతో బైక్పై శనివారం గుంటూరు వెళ్లారు. పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా, యడ్లపాడు సమీపంలోని నక్కవాగు వద్ద గుర్తుతెలియని వాహనం వీరి బైక్ను ఢీకొంది. వాహనం అదుపు తప్పి కిందపడగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఢీకొన్న వాహనం ఆపకుండా వెళ్లిపోయింది. గాయపడిన వారిని హైవే అంబులెన్స్ సిబ్బంది గుంటూరు సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
డివైడర్ను ఢీకొన్న బైక్
నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన షేక్ మహబూబ్ బాషా బైక్పై గుంటూరు వైపు ప్రయాణమయ్యాడు. మద్యం సేవించి ఆపై వేగంలో ఉన్నందున వాహనం అదుపుతప్పి యడ్లపాడు ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్ సమీపంలో డివైడర్ను ఢీకొట్టాడు. బాషా రోడ్డుపై పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. హైవే అంబులెన్స్ సిబ్బంది బాధితుడిని గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.