
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచండి
గుంటూరు ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక అన్నారు. మంగళవారం చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను సందర్శించిన డీఈవో .. 35 మంది విద్యార్థినులకు 6వ తరగతిలో ప్రవేశాలు కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 5వ తరగతి పూర్తి చేసుకున్న వారిని 6వ తరగతిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చేర్పించడంలో ఆయా పాఠశాలల హెచ్ఎంలతోపాటు ఉపాధ్యాయులు, సీఆర్పీలు, విద్యాశాఖాధికారులు సమష్టిగా కృషి చేయాలని ఆదేశించారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిన విద్యార్థులను తిరిగి చేర్పించే విధంగా తల్లిదండ్రులను నచ్చచెప్పాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వాటిపై అవగాహన పెంచాలన్నారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ఎన్రోల్మెంట్ డ్రైవ్లో భాగంగా బడి ఈడు పిల్లలను ఆయా గ్రామాల్లోని ఫౌండేషన్, బేసిక్ ప్రైమరీ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలను పెంచి, ప్రతి పాఠశాలలో పూర్తిస్థాయిలో విద్యార్థుల సంఖ్య చేరేలా ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పాఠ శాల ప్రధానోపాధ్యాయుడు షేక్ ఎండీ ఖాసిం మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేసిన విద్యార్థినులను ఇతర పాఠశాలలకు వెళ్లే అవసరం లేకుండా తమ పాఠశాలలోనే 6వ తరగతిలో చేరే విధంగా తల్లిదండ్రులకు ప్రేరణ కల్పించినట్లు చెప్పారు. పాఠశాలలో చేరిన విద్యార్థినులు ఆధునిక బోధన, మౌలిక వసతులతో విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. గుంటూరు డీవైఈవో ఏసురత్నం, డీసీఈబీ కార్యదర్శి ఎ. తిరుమలేష్, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రాబియా బస్రీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఎన్రోల్మెంట్ డ్రైవ్లో సమష్టిగా కృషి చేయాలి
జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక