
మనుషులు రకరకాల నేప థ్యాలతో పుడతారు. రక రకాల వర్గ, కుల, మత, ప్రాంత, భాష, జాతీయతల ఆధారిత అస్తిత్వాలు, రక రకాల వెనక్కి మళ్లే, ఉన్న చోటనే ఉంచే లేదా నెమ్మది గానో ధృత గతిలోనోముందుకు పోయే ఆలోచ నలు, చింతనలు, సిద్ధాంతాలు, మనస్తత్వాలు ఏర్ప రచుకొని రకరకాల వృత్తులు, వ్యాపకాల్లో కొనసాగి ముందో, వెనకో మరణిస్తారు.
తెంటు చలం అలియాస్ సుధాకర్ గెరిల్లా జీవి తాన్ని ఎంచుకుని నిరుపేదలు, గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపే సంకల్పంతో అజ్ఞాత జీవితం గడుపుతూ అడవి బాట పట్టి నాలుగు దశాబ్దాలు దాటింది. నిజానికి సాయుధ పోరుతో సమాజాన్ని మార్చే అజ్ఞాత రివల్యూషనరీ సగటు ఆయుష్షు మూడు నుంచి ఐదేళ్లకు మించితే గొప్పే. ఎందుకంటే వాళ్ల బతుకు నిరంతర సంగ్రామం. నిత్యం పొంచి ఉన్న దాడుల, అనారోగ్యాల, పాము కాట్ల, నెత్తు టేరుల్లో పుట్టి మునకల కత్తుల కోలాటం. ఎప్పుడో ఎక్కడో ఆయుర్వేద వైద్యుడిగా గడిపి మరణించాల్సిన ఈ చలం అలియాస్ సుధాకర్ 70 ఏళ్లదాకా ఏటికి ఎదురీది ఉత్తరాంధ్ర, గోదావరిమన్యం, ఏవోబీ, అబూజ్మడ్ దండకారణ్యప్రాంతాల్లో నిరుపేద ఆదివాసీ అణగారిన వర్గాలజనాల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం విత్తులు జల్లి దోపిడీని ప్రశ్నించి, ఎదిరించే చైతన్యం అందించి నిష్క్రమించాడు.
సమాజానికి అవసరమైన ఉద్యమం
2004లో వైఎస్సార్ సీఎంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దరిమిలా హోమ్ మంత్రి జానారెడ్డి తదితరులతో చర్చలు జరిపే మావోయిస్టు పార్టీ ప్రతినిధులుగా అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ, తెంటు చలం అలియాస్ సుధాకర్ తదితరులు అడవి వీడి బయటకు వచ్చారు. హైదరాబాద్లో వాళ్లను చూసే అవకాశం మాలాంటి జర్నలిస్టులకు దక్కింది. చాలా సరళమైన, వినమ్ర జీవన విధానం వాళ్లది. వీళ్ల ఉద్యమం ఓ మోస్తరు స్థాయిలో కొనసాగడం సమాజానికీ, గిరిజనులకూ అవసరం అని; వివిధ ప్రభుత్వ సంక్షేమ శాఖలు కోట్ల ఖర్చుతో చేయలేని ఆదివాసీ ఉద్ధరణ పని ఈ ఆదర్శవాద యువత చేస్తోందని 1990లలో ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’లో అప్పటి ఉమ్మడి మధ్యప్రదేశ్ డీజీపీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అదే మాట నేను మళ్లీ రెండు నెలల క్రితం ఒడిశాలో ఓ రైలు ప్రయాణంలో ఓ కోబ్రా కమాండో నోట విన్నాను.
బడా ధనవంతుల రక్షణ తమ ఉద్యోగం అనీ, నిరుపేదల రక్షణ కవచం మావోయిస్టులు అనీ, బ్రతుకుతెరువు కోసమే వాళ్లను హతమార్చే ఉద్యోగం చేస్తున్నాననీ 30 దాటిన వయసులోని 10 ఏళ్ల అనుభవం ఉన్న ఆ యువ కమాండో నాతో అన్నాడు. నిజానికి 19వ శతాబ్దపు జర్మన్, బ్రిటిష్ రాజులు తలచుకుంటే మార్క్స్ లాంటి శ్రామికవర్గ శ్రేయోవాదులు గాని, 20వ శతాబ్దంలో రష్యన్ జార్ చక్రవర్తి ఆగ్రహిస్తే లెనిన్, స్టాలిన్ లాంటి బోల్షెవిక్ ఉద్యమకారులు గాని ప్రవాసాలు, జైలు జీవితాల బదులు చిన్న వయసులోనే క్రూర హత్యలకు గురయ్యేవాళ్లు. కానీ అప్పటి ఫ్యూడల్ ప్రభువులు తమను పడగొట్టే యత్నంలో ఉన్న శక్తులపై కొంత ఉదారంగానే ఉండేవారు. కానీ 21వ శతాబ్దపు సూడో ప్రజాస్వామ్యంలో చర్చలకు సిద్ధమని ప్రకటించినా అందుకు ఏమాత్రం సమ్మతించకుండా, ఇజ్రాయెల్ టెక్ నైపుణ్యం అండతో వేలాది ట్రూప్స్ను కూంబింగ్కు పంపి అడవి జంతువుల్ని వెంటాడి వేటాడినట్టు ప్రభుత్వం దారుణంగా చుట్టు ముట్టి చంపుతోంది.
బుద్ధుని బాటలో మధ్యే మార్గం
చావు ఎవరికీ తప్పదు. అందులోనూ విప్లవ కారులు చావును ఆమోదించే కదా ఆ బాటలోకి వెళ్లారు! వాళ్లయినా, మన రాజకీయ నేతలైనా, మనమెవరిమైనా చిరకాలం ఇక్కడే ఇలాగే పదిలంగా ఉండిపోము. ఉన్నన్ని రోజులూ మనం ఎవరి మేలు కోసం బతికామో భావి తరాలు బేరీజు వేస్తాయి. బుద్ధ ప్రవచిత ‘బహుజన హితమూ, బహుజన సౌఖ్యమే’ ఎప్పటికైనా అనుసరణీయం. ఎక్కువమంది బతుకులు అతలాకుతలం చేసి కొద్ది మందికి కులికే అవకాశం ఇచ్చే ఏ వ్యవస్థా ఎంతో కాలం మనలేదు. ఇప్పటికైనా సాయుధ అణచివేత బదులు బుద్ధుని బాటలో మధ్యే మార్గంలో వెళ్లి శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తే దేశానికి భవిష్యత్లో విధ్వంసక అభివృద్ధి క్రమం వల్ల మరింత తీవ్ర గాయాలు తగిలే బెడద తగ్గుతుంది. అన్ని మూలలకూ ఆర్గానిక్ గ్రోత్ను విస్తరించడం సాధ్యపడుతుంది. కానీ పాలకులిప్పుడు కాస్త లోతుగా ఆలోచించే స్థితిలో ఉన్నారా? అత్యున్నత న్యాయస్థానం, బుద్ధిజీవులు ఆ దిశగా ప్రభుత్వం యోచించేలా చేయగలరా? ఆశావాదం అవసరమైన నైరాశ్య భరిత కాలమిది.
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్