బాధ్యత నుంచి తప్పించుకోవడానికే... | Sakshi Guest Column On Chandrababu Coalition Government | Sakshi
Sakshi News home page

బాధ్యత నుంచి తప్పించుకోవడానికే...

Jun 12 2025 12:46 AM | Updated on Jun 12 2025 12:46 AM

Sakshi Guest Column On Chandrababu Coalition Government

టీడీపీ కూటమి ప్రభుత్వం  ప్రవేశపెట్టిన పీ4 (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్‌ పార్టనర్‌షిప్‌) కార్యక్రమం కోసం విస్తృత ప్రచారం జరుగుతోంది. ‘పీ4’ ద్వారా ఆర్థికంగా స్థిరంగా ఉన్న వారిని ‘మార్గద ర్శులు’గానూ, వీరు దత్తత తీసుకునే పేద కుటుంబాలను ‘బంగారు కుటుంబాలు’ గానూ పేర్కొన్నారు. ఈ మార్గదర్శులు తమ ఖర్చుతో బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని వారి సామాజిక, ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించి నూరు శాతం పేదరిక నిర్మూలన (జీరో పావర్టీ) సాధించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. కానీ దీని వెనక దాగి ఉన్న నిజం వింటే ప్రభుత్వ పెద్దల దుర్బుద్ధి ఇట్టే తేటతెల్లమవుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో 1.48 కోట్ల తెల్ల రేషన్‌  కార్డుదారులు ఉన్నారు. పీ4 ప్రాజెక్టు కింద కేవలం 19.15 లక్షల కుటుంబాలను మాత్రమే ‘పేదలు’గా గుర్తించారు. అంటే 87 శాతం మంది అల్పాదాయ వర్గం (బీపీఎల్‌) పరిధిలోని కుటుంబాలు ఈ దీని పరిధిలోకి రాలేదన్నమాట. నమోదైన వారిలో సైతం మార్గదర్శకులు దత్తత తీసుకున్న బంగారు కుటుంబాలు కేవలం 62,970. అంటే మొత్తం పేదల్లో కేవలం ఒక శాతం కన్నా తక్కువే. వీరికి అండగా నిలిచేందుకు గుర్తించిన మార్గదర్శుల సంఖ్య కేవలం 5325 మంది ఉన్నారు. ఈ సంఖ్యలు చూస్తే... ‘పీ4’ ద్వారా పేదల్లో ఎంత శాతం మందికి మేలు చేకూరు తుందో, వారి జీవన ప్రమాణాలు ఏ స్థాయిలో మెరుగుపడతాయో చెప్పొచ్చు.

కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) ద్వారా కంపెనీలు, సంస్థలు ఏటా నిర్వహించే దాతృత్వ కార్యకలాపాలను ఇక నుండి పీ4లో మార్గదర్శుల ఖాతాలో చూపించబోతున్నారు. వాస్తవానికి, కంపెనీల చట్టం 2013 ప్రకారం కంపెనీల స్థాయిని బట్టి తమ లాభాల్లో 2 శాతం సీఎస్‌ఆర్‌ కార్యకలాపాల కోసం ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, పర్యావరణం, నైపుణ్య అభివృద్ధి వంటి రంగాల్లో పేదల అభ్యున్నతి కోసం ఖర్చు చేయాలి. ఇలా ఏటా వేల కోట్లు కంపెనీలు ఖర్చు చేస్తున్నాయి. 

ఇప్పుడు అదే పనిని పీ4 కింద చేర్చి ఆ క్రెడిట్‌ తమ ఖాతాలో వేసుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచన. సాధారణంగా పేదల ఆరోగ్యం, విద్య, వైద్యం, నైపుణ్య అభివృద్ధి, ఇతర సంక్షేమ అవసరాలు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఈ బాధ్యత నుంచి తప్పించు కుంటూ పీ4 పేరిట కార్పొరేట్‌ సంస్థలు, వ్యక్తులకు దీన్ని ప్రభుత్వం అప్పగించాలని చూడడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.  పేదలకు ఆర్థిక చేయూత నిచ్చే సంక్షేమ కార్యక్రమాలకు మంగళం పాడే కుట్రలో భాగమే ఇదని చెప్పొచ్చు. 

ఈ పీ4 కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం – పేదలకు ధనవంతులు సహాయం చేయటం! కానీ చంద్రబాబు నాయుడు అమలు చేసిన ప్రైవేటీకరణ విధానాల ఫలితంగా ప్రయోజనం పొందిన పెట్టుబడి దారులను ‘మార్గదర్శులు’ అని పిలవడం సరికాదు. సూపర్‌–6 వాగ్దా నాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రభుత్వ పెద్దలు పీ4ను తెరపైకి తెచ్చినట్లుంది. 

వైఎస్సార్‌ వంటి మహానేతలు ప్రారంభించిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి పథకాలతో పాటు ఇటీవల వైఎస్‌ జగన్‌  ప్రభుత్వం అమలు చేసిన ‘నవరత్నాలు’ ప్రజల అవసరాలను నేరుగా తీరుస్తూ సంక్షేమాన్ని వారి కళ్ల ముందు నిలిపాయి. కానీ నేటి ప్రభు త్వానికి సంక్షేమ స్పృహ కని పించడం లేదనే అభిప్రాయం ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. ఏదైనా పథకాన్ని ప్రభుత్వ భాగ స్వామ్యంతో నడిపితే సత్ఫలితాలుంటాయి. అది జరగనప్పుడు రాష్ట్రాభివృద్ధి తిరోగమిస్తుంది. పీ4 అనేది ప్రభుత్వ భాగస్వామ్యంతో నడిచే కార్యక్రమం కానే కాదనేది గమనార్హం.  

ఇటువంటి కార్యక్రమాల అమలును స్వతంత్ర ట్రస్ట్‌ల ద్వారా, పార దర్శక ఆడిటింగ్‌తో, ప్రభుత్వ భాగస్వామ్యంతో పర్యవేక్షిస్తేనే విశ్వస నీయత పెరుగు తుంది. లేదంటే, ఇది కూడా ఓ ‘సూపర్‌–6’ నినాదం లాగా మిగిలి పోతుంది. పేదల ఆత్మాభిమానాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెట్టడం దీనిలో కనిపిస్తోంది. తాము సహాయం చేస్తున్నాం కాబట్టి ఎన్నికల సమయంలో తాము చెప్పిన రాజకీయ పక్షాలకే ఓటువేయాలని కార్పొరేట్‌ సంస్థలు పేదలపై ఒత్తిడి తేవచ్చు. 

అదే జరిగితే ప్రజా స్వామ్యం మంట గలిసిపోతుంది. కార్పొరేట్లు ఎవరిని తలచుకుంటే వారినే అధికారంలో కూర్చోబెట్టగలుగుతారు. ఎటూ ఈ కార్యక్రమాన్ని తామే ప్రవేశపెట్టాం కనుక పేదప్రజలను తమ ఓటుబ్యాంకుగా కార్పొ రేట్లు మారుస్తారని ప్రస్తుత ప్రభుత్వాధినేత ఆలోచన. ఇదే పీ4 వెనుక ఉన్న అసలు రహస్యం!
– తలకోల రాహుల్‌ రెడ్డి,ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎనలిస్ట్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement