నాకు రెండేళ్ల పాప ఉంది. పాప అస్సలు సరిగా తినడం లేదు. పళ్లెంలో పెట్టిన ప్రతి దాన్ని తిరస్కరిస్తోంది. ఎంత చెప్పినా వినడం లేదు. భోజన సమయం అంటే ఇంట్లో గొడవే అవుతోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
– సునీత, విజయవాడ.
రెండు సంవత్సరాల పిల్లలు తక్కువగా తినడం, సాధారణంగా కనిపించే సమస్య. దీన్ని ‘ఫస్సీ ఈటింగ్’ లేదా ‘పిక్కీ ఈటింగ్’ అంటాము. పుట్టినప్పటి నుంచి దాదాపు ఒకటిన్నర సంవత్సరాల వరకు పిల్లలు వేగంగా పెరుగుతారు కాబట్టి ఆకలి కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ రెండో సంవత్సరం నుంచి ఎదుగుదల కొంచెం నెమ్మదిస్తుంది. అందుకే ఆకలి కూడా తగ్గినట్లు అనిపిస్తుంది. ఇది వ్యాధి కాదు, శరీరంలో సహజంగా జరిగే మార్పు. ఇలాంటి పిల్లల్లో ముందుగా భోజన సమయాన్ని ప్రశాంతంగా మార్చాలి. బలవంతంగా తినిపించడం, కోప్పడటం, పిల్లల వెంట తిరగడం వల్ల వాళ్లు ఇంకా ఎక్కువగా ఆహారాన్ని తిరస్కరిస్తారు.
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏం తినాలి, ఎప్పుడు పెట్టాలి అనేది తల్లిదండ్రుల బాధ్యత. కానీ ఎంత తినాలి అనేది పిల్లల నిర్ణయం. చాలాసార్లు తల్లిదండ్రులు పిల్లలు తక్కువ తింటున్నారని ఆందోళనతో ఒత్తిడి పెడతారు. కానీ పిల్లలు తమ ఆకలికి తగ్గట్టే తింటారు. కొత్త ఆహారాన్ని ఒకసారి తిరస్కరించిందని వెంటనే ఆపేయకూడదు. చిన్నపిల్లలు కొత్త రుచిని అంగీకరించడానికి సమయం తీసుకుంటారు. కొన్నిసార్లు ఒక ఆహారాన్ని 10 నుంచి 15 సార్లు పరిచయం చేసిన తర్వాతే అలవాటు పడతారు. కాబట్టి ఓపిక చాలా ముఖ్యం.
పిల్లలకు పెద్ద పళ్లెం పెట్టడం కన్నా చిన్న పరిమాణాల్లో, రంగురంగులుగా, ఆకర్షణీయంగా ఆహారం పెట్టాలి. అలాగే మధ్య మధ్యలో బిస్కట్లు, చాక్లెట్లు, జ్యూసులు లేదా ఎక్కువ పాలు ఇస్తూ ఉంటే అసలు ఆకలి తగ్గిపోతుంది. ‘కొంచెం ఆకలి’ కూడా పిల్లలకు మంచి ఔషధం లాంటిదే. మొబైల్ లేదా టీవీ ముందు కూర్చోబెట్టి తినిపించే అలవాటు తగ్గించడం మంచిది. అప్పటికి తిన్నట్టే అనిపించినా, దీర్ఘకాలంలో అది మంచి తినే అలవాట్లను దెబ్బతీస్తుంది. కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చుని తింటే పిల్లలు కూడా చూసి నేర్చుకుంటారు. పిల్లలు మాటలు కన్నా మన ప్రవర్తననే ఎక్కువగా అనుకరిస్తారు.
‘ఇది తింటే చాక్లెట్ ఇస్తా’ అని లంచం ఇవ్వడం కన్నా, ‘వావ్! నువ్వు కొత్త కూర రుచి చూసావు కదా!’ అని ప్రశంసించడం మంచిది. అలాగే ఒక్కరోజు తక్కువ తిన్నారని భయపడాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లల ఆకలి రోజురోజుకీ మారుతూ ఉంటుంది. ఒక భోజనం లేదా ఒక రోజు కాకుండా, మొత్తం వారం ఎలా తింటున్నారు అన్నది చూసి అంచనా వేయాలి. అయితే కొన్ని లక్షణాలు ఉంటే మాత్రం తప్పకుండా పిల్లల వైద్యుడిని సంప్రదించాలి.
బరువు పెరగకపోవడం, తరచు వాంతులు అవడం, మింగడంలో ఇబ్బంది ఉండడం, కొన్ని ఆహారాలనే పూర్తిగా తిరస్కరించడం, చాలా అలసటగా కనిపించడం లేదా ఎదుగుదల మందగించడం వంటి లక్షణాలు ఉంటే పరీక్షలు అవసరం కావచ్చు. చాలా సందర్భాల్లో సరైన ఆహార అలవాట్లు, ఓపిక, కుటుంబ సహకారం ఉంటే పిల్లలు క్రమంగా మంచి తినే అలవాట్లు అలవరుచుకుంటారు.
-డా‘‘ కె. పవన్ కుమార్
-సీనియర్ పీడియాట్రిషియన్ , పీడియాట్రిక్ అలర్జిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్


