రికార్డ్‌ ధర పలికిన ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్, రూ.118 కోట్లు | MF Husain shatters record for modern Indian art sells for Rs 118.7 crore | Sakshi
Sakshi News home page

రికార్డ్‌ ధర పలికిన ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్, రూ.118 కోట్లు

Mar 21 2025 1:27 PM | Updated on Mar 21 2025 3:17 PM

MF Husain shatters record for modern Indian art sells for Rs 118.7 crore

ప్రఖ్యాత భారతీయ  చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. 1950ల నాటి  ఈ లెజెండరీ ఆర్టిస్టు మోడ్రన్‌ ఆర్ట్‌కు పెట్టింది పేరు.మార్చి 19న న్యూయార్క్‌లో జరిగిన క్రిస్టీ వేలంలో  గతంతో  పోలిస్తే రెట్టింపు ధర  పలికింది. 2023లో ముంబైలో జరిగిన వేలంలో దాదాపు రూ.61.8 కోట్లు పలికిన పెయింటింగ్‌ పోలిస్తే 13.8 మిలియన్ల డాలర్లకు (రూ.118 కోట్లకు పైగా)  ధర పలికింది. ఇది  అత్యంత ఖరీదైన వేలంగా సరి కొత్త రికార్డును సృష్టించింది.

గతంలో రికార్డు సృష్టించిన అమృతా షేర్-గిల్ 1937 నాటి "ది స్టోరీ టెల్లర్" పెయింటింగ్‌ కంటే హుస్సేన్‌ ఆర్ట్‌ దాదాపు రెట్టింపు ధర  సాధించింది. గతంలో, హుస్సేన్ అత్యంత ఖరీదైన పెయింటింగ్, అన్‌టైటిల్డ్ (పునర్జన్మ) గత సంవత్సరం లండన్‌సుమారు రూ. 25.7 కోట్లకు అమ్ముడైంది. ఒకే కాన్వాస్‌లో దాదాపు 14 అడుగుల విస్తీర్ణంలో 13 ప్రత్యేకమైన  చిత్రాలతో'గ్రామ తీర్థయాత్ర' పెయింటింగ్‌ను  తీర్చిదిద్దారు హుస్సేన్‌. హుస్సేన్ పెయింటింగ్స్‌లో దీన్ని ప్రముఖంగా పేర్కొంటారు.  దీనిపై  క్రిస్టీస్ సౌత్ ఆసియన్ మోడరన్ అండ్ కాంటెంపరరీ ఆర్ట్ హెడ్ నిషాద్ అవారి సంతోషం వ్యక్తం చేశారు.  ఆయన పనితనానికి  కొత్త బెంచ్‌మార్క్ విలువను నిర్ణయించడంలో తాము భాగం కావడం ఆనందదాయకమన్నారు. ఇదొక మైలురాయి అని ప్రకటించారు.

1954లో భారతదేశాన్ని వదిలి వెళ్ళిందీ  ఈ పెయింటింగ్. ఉక్రెయిన్‌లో జన్మించిన నార్వేకు చెందిన వైద్యుడు లియోన్ ఎలియాస్ వోలోడార్స్కీ దీనిని కొనుగోలు చేశారు. ఎలియాస్‌  ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కోసం థొరాసిక్ సర్జరీ శిక్షణా కేంద్రాన్ని  ఢిల్లీలో స్థాపించారు. వోలోడార్స్కీ 1964లో దీన్ని ఓస్లో యూనివర్సిటీ హాస్పిటల్‌కు అప్పగించారు. ఈ అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం సంస్థలో భవిష్యత్ తరాల వైద్యుల శిక్షణకు తోడ్పడుతుంది.

కాగా 1915 సెప్టెంబర్ 17న మహారాష్ట్రలోని పంధర్‌పూర్‌లో జన్మించారు హుస్సేన్. ఇండియాలో టాప్‌ ఆర్టిస్ట్‌గా పేరు సాధించారు.  ప్రపంచవ్యాప్తంగా ఆయన కళాకృతులు ఆదరణ సంపాదించాయి. అయితే దేవుళ్ళు , దేవతలపై వేసిన చిత్రాలు  వివాదాన్ని రేపాయి.  కేసులు, హత్యా బెదిరింపుల  నేపథ్యంలో విదేశాల్లో తలదాచుకున్నాడు.  2011 జూన్‌ 9న  95 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement