వివాహం అనగానే ఓ పండుగ వాతావరణంలో ఉంటుంది. మా ఊర్లో ఫలాన వాళ్లది పెళ్లి అని అంతా సంతోషంగా చెప్పుకుంటారు కూడా. ఆ ఆనందం పెళ్లిని నిర్వహిస్తున్న కుటుంబాలకే చెందినదైనా..ఆ ఊరు లేదా ఆ గ్రామంలోని అందరి కళ్లలో సంతోషం వెల్లివెరిస్తుంది. అయితే ఇక్కడ ఈ వివాహ వేడుక ఈ సంతోషం తమకు మాత్రమే గాక ప్రజలందరూ సంబరపడే ఉండాలని ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్కి యావత్తు గ్రామం ఫిదా అవ్వడమే కాదు..కళ్లు చెమర్చాయ్. ఆహా..! మీ వివాహ వేడుక మా ఆర్థిక భద్రతగా మారిందా అని అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..ఈ వింత ఘటన మహారాష్ట్రలోని బహదర్పురా గ్రామంలో చోటు చేసుకుంది. అక్కడ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. మంచి సంగీతం, విందు భోజనంతో పాటు ఈ వేడుక సంతోషం అందరికి చేరువవ్వాలిని అపురూపమైన రిటర్న్ గిఫ్ట్లు అందించింది వరుడు కుటుంబం. వివాహ తంతులో సాంప్రదాయ జ్ఞాపికలు లేదా బహుమతులకు బదులుగా వరుడు సిద్ధేశ్వర్ పేఠ్కర్ అతని కుటుంబం గ్రామంలోని 3,465 మంది నివాసితులందరికీ రూ. 34.6 కోట్ల విలువైన ప్రమాద బీమా కవరేజీని బహుమతిగా ఇచ్చింది.
అర్హులైన ప్రతి గ్రామస్తునికి భీమా సౌకర్యం..
పేఠ్కర్ కుటుంబం స్థానిక గ్రామ పంచాయతీ పేరు మీద గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసింది. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి, అలాగే ఎవ్వరూ మినహాయించబడకుండా ఉండేలా. .గ్రామ ఓటర్ల జాబితానే నేరుగా బీమా కంపెనీకి సమర్పించింది. దాంతో అర్హులైన ప్రతి నివాసికి స్వయంచాలకంగా రూ. 1 లక్ష ప్రమాద బీమా లభించేందుకు మార్గం సులభమైంది. ఈ బీమా పాలసీ ఒక ఏడాది పాటు చెల్లుబాటు అవుతుంది. అలాగే భవిష్యత్తు పునరుద్ధరణపై చర్చలు కూడా జరగనున్నాయి.
అయితే, పాలసీ కోసం చెల్లించిన మొత్తం ప్రీమియంను వెల్లడించకూడదని ఆ కుటుంబం నిర్ణయించుకుంది. ఈ మేరకు వరుడు కుటుంబసభ్యులు మాట్లాడుతూ.."మన సంస్కృతిలో దానధర్మాల గురించి అందరికీ చాటింపు వేయం. అందుకే ఎవ్వరికీ ఆ మొత్తం సొమ్ము గురించి చెప్పాలనుకోవడం లేదు. మాకు కేవలం ఆశీర్వాదం చాలు. చప్పట్లు పొగడ్లతో పనిలేదు. ఆకస్మిక ప్రమాదాలు గ్రామీణ కుటుంబాలను ఆర్థికంగా ఎలా నాశనం చేస్తాయో ప్రత్యక్షంగా చూడటం వల్ల తమకు ఈ ఆలోచన వచ్చిందన్నారు. ఈ ప్రాంతంలోని అనేక గ్రామాలలో పాముకాట్లు, పిడుగుపాటు, వ్యవసాయ సంబంధిత ప్రమాదాలు సర్వసాధారణం, పైగా బీమా సౌకర్యం చాలా అరుదుగా ఉంటుంది.
మా ఆనందం మా ఇంటికే పరిమితం కాకూడదనే ఇలా చేశాం. ఈ పెళ్లి కేవలం జ్ఞాపకంగా మాత్రమే కాకుండా రక్షణగా మారాలని ఆశించే ఇలా చేశామని అన్నారు". వరుడు సిద్ధేశ్వర్ కుటుంబీకులు. అక్కడి గ్రామస్తులు సైతం ఇప్పటివరకు ఇలాంటి పెళ్లి కానుకను చూడలేదని..మొత్తం గ్రామానికే సాముహిక సంరక్షణను అందించే ఆర్థిక భద్రతను అందించిందంటూ సదరు వరుడు కుటుంబంపై ప్రశంసల వర్షం కురిపించారు.
(చదవండి: రూ. 300 కోట్ల కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఉద్యోగానికి రిజైన్..! ఆ క్షణమే అమ్మ, బార్య..)


