సేంద్రియ ఆహార మార్కెట్లకు చోటివ్వండి! | Kavitha Kuruganti exclusive interview: Sagubadi | Sakshi
Sakshi News home page

సేంద్రియ ఆహార మార్కెట్లకు చోటివ్వండి!

Mar 10 2026 11:37 AM | Updated on Mar 10 2026 11:53 AM

Kavitha Kuruganti exclusive interview: Sagubadi

‘ఆషా–కిసాన్‌ స్వరాజ్‌’ నెట్‌వర్క్‌ జాతీయ కన్వీనర్‌ కురుగంటి కవితతో ‘సాక్షి సాగుబడి’ ముఖాముఖి

కురుగంటి కవిత... మన దేశంలో రైతుల హక్కులు, సుస్థిర వ్యవసాయ జీవనోపాధుల పరిరక్షణ కోసం పోరాడుతున్న ఓ ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి. దేశవ్యాప్తంగా సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులు, రైతు శాస్త్రవేత్తలు, దేశీ విత్తన పరిరక్షకులు, స్వతంత్ర శాస్త్రవేత్తలు, పౌర సంస్థలు, వ్యక్తులతో కూడిన ఒక విస్తృతమైన నెట్‌వర్క్‌ ‘అలియన్స్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ అండ్‌ హోలిస్టిక్‌ అగ్రికల్చర్‌ (ఆషా)’. దీనికి కవిత జాతీయ కన్వీనర్‌గా సేవలందిస్తున్నారు. ఆషా–కిసాన్‌ స్వరాజ్, జాతీయ మహిళా రైతుల హక్కుల సంఘం (మకాం), ప్రకృతి వ్యవసాయంపై జాతీయ మిషన్‌ (ఎన్‌సీఎన్‌ఎఫ్‌), కోలిషన్‌ ఫర్‌ ఎ జీఎం–ఫ్రీ ఇండియా వంటి అనేక జాతీయ వేదికల్లో ఆమె దశాబ్దాలుగా కీలకపాత్ర పోషిస్తున్నారు. రైతాంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. 

స్వావలంబనే శ్వాసగా కదిలే సేంద్రియ, ప్రకృతి వ్యవసాయదారులకు, రైతు శాస్త్రవేత్తలకు, రైతుల హక్కుల కోసం కృషి చేసే స్వచ్ఛంద కార్యకర్తలు, సంస్థలకు బలమైన సమష్టి గొంతుకగా ఆషా–కిసాన్‌ స్వరాజ్‌ నెట్‌వర్క్‌ నిలుస్తోంది. సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్మితేనే వారికి సముచిత ఆదాయం వస్తుంది. సేంద్రియ మార్కెట్ల నిర్వహణకు కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో రైతులకు కాస్త చోటివ్వమని నగర/పట్టణవాసులకు ఆమె పిలుపు ఇచ్చారు. ఆరో కిసాన్‌ స్వరాజ్‌ సమ్మేళనాన్ని (kisan swaraj sammelan 2026) ఇటీవల మైసూరులో ఘనంగా నిర్వహించిన కవిత కురుగంటితో ‘సాక్షి సాగుబడి’ ముఖాముఖిలో కొన్ని ముఖ్యాంశాలు.

‘ఆషా’ ఎప్పుడు, ఎలా పుట్టింది? 
కురుగంటి కవిత (kavitha kuruganti): 15 ఏళ్ల క్రితం ‘ఆషా’ కిసాన్‌ స్వరాజ్‌ సంస్థ పుట్టింది. బీటీ వంగ ప్రతిఘటన ఉద్యమకాలంలో ‘కోలియేషన్‌ ఫర్‌ ఎ జీఎం–ఫ్రీ ఇండియా’ను మేమంతా 2004లో సేవాగ్రామ్‌లోని గాంధీ ఆశ్రమంలో కూర్చొని ఏర్పాటు చేసుకున్నాం. బీటీ పత్తి మన దేశంలోకి వచ్చి అప్పటికి రెండేళ్లు గడిచాయి. బీటి పత్తి (BT Cotton) వల్ల ఆచరణలో ఎదురవుతున్న సమస్యలు ఆధారసహితంగా తెలిసివస్తున్న రోజులవి. కార్పొరేట్‌ కంపెనీల నియంత్రణ నుంచి బయటకు రావటం కోసం, స్వావలంబన సేద్యం కోసం రైతులు అనుసరించవలసిన పద్ధతులు, విష ముక్త, రుణ ముక్త, ఆత్మహత్య ముక్త జీవనోపాధుల వ్యవస్థ సాధించాలన్నది మా లక్ష్యం. అప్పుడు మేం అనుకున్నదేమిటంటే.. రైతు తన పొలంలో నడుము వంచి పనిచేసుకుంటున్నప్పుడు ఏదైనా ఎద్దు చేనులోకి చొరబడితే చేతిలో పని ఆపేసి ముందు ఆ ఎద్దును బయటకు తరమాలి కదా. అలాగే మిగతా పనులన్నీ పక్కనపెట్టి జన్యుమార్పిడి పంటలను పారదోలాలని అనుకున్నాం. ఆ విధంగా దేశంలో ఒక ఉద్యమం నిర్మించటానికి ఆరేళ్లు విపరీతంగా కష్టపడ్డాం.

కేంద్ర పర్యావరణ మంత్రి జయరామ్‌ రమేశ్‌ 2009 డిసెంబర్‌ నుంచి జీఎం వంగపై ప్రజాభిప్రాయ సేకరణ మొదలు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వాల చేత నో అనిపించటం కోసం, సైంటిస్టులను, డాక్టర్లను ఈ ఉద్యమంలోకి తేవటం కోసం దేశమంతా తిరుగుతూ, చర్చలు పెడుతూ.. రాత్రి, పగలు అవిశ్రాంతంగా పని చేశాం. 2010 ఫిబ్రవరి 9న బీటీ వంగపై నిరవధిక మారటోరియం ప్రకటించారు. అదే మా తొలి విజయం. అదే సంవత్సరం మార్చిలో నాగపూర్‌లో మేం మళ్లీ కలిసి కార్యాచరణ నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా పత్తి రైతుల ఆత్మహత్యలు జరుగుతున్న ప్రాంతాల్లో ‘కిసాన్‌ స్వరాజ్‌ యాత్ర’ చేపట్టాం. 71 రోజులు 220 మందిమి 20 వేల కిలోమీటర్లు 20 రాష్ట్రాల్లో బస్సు యాత్ర చేసి రాజ్‌ఘాట్‌లో ముగించి, సోనియా గాంధీకి మా డిమాండ్ల పత్రాన్ని ఇచ్చాం.

మేము బయలుదేరిందేమో ఆత్మహత్య దారితీయని సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వ్యాప్తి కోసమని. అయితే, దేశవ్యాప్తంగా రైతులు ఇతర సమస్యలను మా దృష్టికి తెచ్చారు. ఆర్గానిక్‌ సేద్యం (Organic Farming) కన్నా ముందు గిట్టుబాటు ధర, భూసేకరణ, వ్యవసాయంపై పారిశ్రామిక కాలుష్యం ముప్పు వంటి సమస్యలను పరిష్కరించాలని గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల్లో రైతులు కోరారు. సిటీల్లో ప్రజలు తమకు రసాయన అవశేషాల్లేని ఆహారం కావాలని అడిగారు. ముంబైలో మహేశ్‌ భట్‌ వంటి బాలీవుడ్‌ పెద్దలూ మాకు స్వాగతం పలికారు. ఈ యాత్ర నుంచే ‘ఆషా–కిసాన్‌ స్వరాజ్‌’ పుట్టింది. ‘కిసాన్‌ స్వరాజ్‌ నీతి’ పేరుతో మార్గదర్శకాలను నిర్దేశించుకొని, వాటి సాధన కోసం పని చేస్తున్నాం.

మీరు సాధించిందేమిటి?
కవిత: దేశంలో వ్యవసాయం మీద ఇష్టం ఉన్నవాళ్లకి మనం ముందుకెళ్లాల్సిన దారి ఏమిటో దిశా నిర్దేశం చెయ్యటంలో ఆషా–కిసాన్‌ స్వరాజ్‌ విజయం సాధించింది. గందరగోళాన్ని పారదోలింది. బీటీ వంగ పంట రాకుండా ఆపింది. రసాయనిక వ్యవసాయంతో ఎదురవుతున్న రకరకాల సంక్షోభాలు, జన్యుమార్పిడి పంటలతో (genetically modified crops) సమస్యలు వంటి వాటిపై వాస్తవ గణాంకాల ఆధారిత నివేదికలను రూపొందించటం, సంబంధిత సమగ్ర జ్ఞానాన్ని అందుబాటులోకి తేవటంలో మేం సఫలమయ్యాం. ఉదాహరణకు.. రైస్‌ ఫోర్టిఫికేషన్‌. అధ్యయన నివేదికలు రూపొందించాం. ఇది ప్రజారోగ్యానికి హానికరం కాబట్టి వద్దు అని చెప్పాం. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేశాం. 23 ఏళ్లుగా మరో జన్యుమార్పిడి పంటను వాణిజ్యపరంగా బయటకు రాకుండా ఆపగలిగాం. అంతేకాదు, ముఖ్యంగా ఏ రాష్ట్రంలోనూ క్షేత్ర ప్రయోగాలు జరపకుండా కూడా ఆయా ప్రభుత్వాలను విజయవంతంగా ఒప్పించగలిగాం.

ప్రజల నుంచి మీరేమి ఆశిస్తున్నారు?
కవిత: ఆరోగ్యదాయకమైన ఆహారం గురించి అందరూ చైతన్యం పెంచుకోవాలి. మీ కోసం, మీ పిల్లల ఆరోగ్యం కోసం మీరు ఈ పని చెయ్యగలిగితే.. అనేక విధాలుగా మేలు కలుగుతుంది. మీ ఆరోగ్యం బాగవుతుంది. వ్యవసాయంపై కార్పొరేట్‌ కంపెనీల నియంత్రణ కొంత తగ్గుతుంది. ఎక్కువ మంది రైతులు స్వావలంబనతో కూడిన వ్యవసాయం వైపు మొగ్గుచూపుతారు. నగరాలు, పట్టణాల్లో ప్రజలను నేను కోరుతున్న మరో విషయమేమిటంటే.. సేంద్రియ/ ప్రకృతి రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్ముకోవటానికి చోటివ్వండి. మీ ఇళ్లు/ గేటెడ్‌ కమ్యూనిటీలు/ కాలనీల్లో తరచూ సేంద్రియ సంతల నిర్వహణకు చోటు కల్పించండి. తద్వారా మధ్యవర్తుల బెడద తీరి, రైతుల ఆదాయం పెరుగుతుంది. అర్హులైన రైతులను గుర్తించి, సమన్వయపరచడానికి స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులకు కొదువ లేదు. చెన్నై, మాండ్యలలో రైతులే నిర్వహించుకునే సేంద్రియ మార్కెట్లే ఇందుకు నిదర్శనాలు.

ఏమిటా ‘కిసాన్‌ స్వరాజ్‌ నీతి’ సూత్రాలు?
కవిత: డా. జయతీఘోష్, డా. డి. నరసింహారెడ్డి వంటి చాలా మంది మేధావులతో లోతుగా చర్చించి 4 మార్గదర్శకాలను నిర్దేశించుకున్నాం. 1. కనీస మద్దతు ధర కావాలని రైతులు అడుగుతుంటారు. అయితే, అది దొరికినా ఆదాయ భద్రత దొరక్కపోవచ్చు. అందుకే రైతులకు ఆదాయ భద్రత కల్పించాలి. 2. ప్రభుత్వం వ్యవసాయ విధాన నిర్ణయం ఏది చేసినా అది పర్యావరణ సుస్థిరతకు లోబడి ఉండేలా చూడాలి. 3. భూమి, విత్తనం, నీరు వంటి వ్యవసాయ వనరులపై హక్కు రైతు సముదాయం చేతుల్లోనే ఉండాలి. 4. వినియోగదారులందరికీ వైవిధ్యభరితమైన, భద్రమైన, పుష్కలంగా, పోషక సంపన్నమైన ఆహారాన్ని అందించాలి. మా లక్ష్యం కేవలం సుస్థిర వ్యవసాయం కాదు. ఇవన్నీ కలిసి ఉండే హోలిస్టిక్‌ అగ్రికల్చర్‌. ఈ మార్గదర్శకాలే మమ్మల్ని నడిపిస్తున్నాయి. మహిళా రైతులు, కౌలు రైతులు, ఆదివాసీ రైతుల హక్కులపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం.

‘ఆషా’ నిర్మాణం ఎలా ఉంది?
కవిత: మాది సభ్యత్వం, ఎన్నికల ఆధారంగా పనిచేసే సంస్థ కాదు. దేశవ్యాప్తంగా భావసారూప్యత ఉన్న సంస్థలు, వ్యక్తుల్ని కలుపుకొని వెళ్లే ఒక వేదిక మాత్రమే. ఆషా స్వచ్ఛంద సంస్థ కాదు. మాకు బ్యాంకు ఎకౌంట్‌ లేదు, ఆఫీసు, సిబ్బంది లేరు. ఇళ్ల నుంచే మేం పనిచేస్తున్నాం. మా సొంత డబ్బునే ఖర్చు పెట్టుకొని పనిచేస్తున్నాం. వేరే యూనియన్ల మాదిరిగా ఇది వద్దు, అది వద్దు అనే వైఖరికి పరిమితం కాకుండా.. సమస్యలకు నిర్మాణాత్మక పరిష్కారాలను చూపే సంఘర్ష్, నిర్మాణ్‌లతో కూడిన వేదికగా ‘ఆషా’ను తీర్చిదిద్దాం. మాలో చాలా మందిమి ధర్నాల్లో పాల్గొంటాం, ప్రభుత్వ సలహా బృందాల్లోనూ సభ్యులుగా ఉంటాం. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చెయ్యటానికని కేంద్ర ప్రభుత్వం నియమించిన అశోక్‌ దల్వాయి వర్కింగ్‌ కమిటీలో నేను, కిరణ్‌ సభ్యులుగా ఉండి, మూడు సంపుటాలలో మా సూచనలిచ్చాం. అదే సమయంలో కిసాన్‌ ముక్తి యాత్ర వంటి ఆందోళనలు నిర్వహించాం.

చ‌ద‌వండి: ఆహార వృథాను అరికట్టే ‘అర్క ట్రైసైకిల్‌’

తెలుగు బిడ్డ!
కురుగంటి కవిత తెలుగింటి బిడ్డే! ఆమె తల్లిదండ్రులు గంగాభవాని (తూ.గో. జిల్లా పలివెల), రమేశ్‌ (గుంటూరు). హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎమ్మే చదివిన తర్వాత జహీరాబాద్‌ వద్ద పస్తాపూర్‌లోని డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ(డీడీఎస్‌)లో దళిత మహిళా రైతుల అభ్యున్నతి కోసం ఐదేళ్లపాటు పనిచేశారు. తదనంతరం బెంగళూరులో (ఈ మధ్యనే మైసూరుకు మారారు) స్థిరనివాసం ఉంటూ జాతీయ రైతాంగ ఉద్యమం నిర్మాణానికి కృషి చేస్తున్నారు. జాతీయ స్థాయిలో 400కుపైగా సంస్థలు, వ్యక్తులతో కూడిన ‘అలియన్స్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ అండ్‌ హోలిస్టిక్‌ అగ్రికల్చర్‌ (ఆషా) ఉద్యమాన్ని గత 15 ఏళ్లుగా ముందుండి నడిపిస్తున్నారు. ప్రభుత్వ విధానాల్లో గుణాత్మక మార్పు కోసం జరిగే పోరాటాల్లో ఆమె కీలక పాత్ర నిర్వహిస్తున్నారు.

ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement