కుటుంబం, యావత్తు సమాజం తన పుట్టుకను అంగీకరించలేదు. అడగడుగున వివక్ష, హేళనలు అవమానాలు. వాటన్నింటిని తన పని, గుర్తింపుతోనే తగిన సమాధానమివ్వగలనని భావించి నిశబ్దంగా పట్లుదలతో సాగింది. ఇవాళ ఆ నమ్మకమే గెలిచి..ప్రపంచం ముందు విజేతగా నిలబెట్టింది. ట్రాన్స్జెండర్ విలక్షణమైన మనిషి, విభిన్నంకాదు అని అందరు అంగీకరించేలా తన గెలుపుతో చాటిచెప్పింది.
ఆ మహిళే డాక్టర్ ఎన్ జెన్సీ.తమిళనాడులో పీహెచ్డీ పట్టా పొందిన తొలి ట్రాన్స్ జెండర్. ఆ తర్వాత ఆమె లయోలా కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియామకం పొందారు. యూజీ,పీజీలలో స్వర్ణ పతక విజేత అయిన ఆమె ఇప్పుడు ట్రాన్స్జెండర్ విద్యార్థులకు ఉచిత విద్య, జీవనోపాధి సహాయం అందించడంతో తోడ్పడుతున్నారు. తమిళనాడులోని తిరుత్తని సమీపంలో ఉన్న ఆర్కే పేట అనే చిన్నగ్రామంలో జెన్సీ బాల్యం సాగింది.
అంత చిన్న వయసులోనే కఠోర సత్యం తెలుసుకుంది తనను ఈ ప్రపంచం మనుగడ సాగించనివ్వదని. తల్లిదండ్రులు మద్దతు లేకుండా సాగుతున్న ఆమెకు గుర్తింపు కోసం పోరాటం ఆ క్షణం నుంచి మొదలైంది. తనకు రక్షణగా ఉండేది ఏది అని అన్వేషించడం మొదలుపెట్టింది.
అనుక్షణం వెంటాడుత్ను వివక్షకు విరుగుడు విద్య మాత్రమే అని అర్థం చేసుకున్నా అని ఓ ఇంటర్వూలో జెన్సీ స్వయంగా చెప్పింది. అది మొదలు ఎప్పుడు గుర్తింపు పొందేలానే చదవాలని గట్టిగా నిర్ణయించుకుంది. అలా వలక్కనంపూడిలోని స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యలో కూడా ప్రథమ స్థానంలో ఉండేది. ఉపాధ్యాయులు, సహ విద్యార్థులు నుంచి తన ప్రతిభతో గుర్తింపు, గౌరవం దక్కించుకునేలా ఆహర్నిశలు కష్టపడింది. ఆ పరుగు తిరుత్తానిలోని అరుల్మిగు సుబ్రహ్మణ్యస్వామి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల చేరి ఆంగ్లంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ చదువు వరకు కొనసాగించిది. అందులో కూడా గోల్డ్ మెడల్ సాధించింది.
ఆ తర్వాత ఆమె డాక్టర్ అంబేద్కర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మాస్టర్స్, ఎంఫిల్ చేసింది. ఆ రెండింటిలోనూ గోల్డ్ మెడల్ ఆమెదే కావడం విశేషం. ఆ తర్వాత చెన్నైలోని లయోలా కళాశాల నుంచి ఆంగ్లంలో పిహెచ్డి పూర్తి చేసి, అక్కడే అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియామకం పొందింది. అలా ఆమె తమిళనాడు డాక్టరేట్ పొది అసిస్టెంట్ ప్రొఫెస్ర్గా నియామకం పొందిన తొలి ట్రాన్స్ జెండ్ మహిళగా నిలిచింది. అంతేగాదు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సైతం బహిరంగంగా ఆమెను అభినందించారు. అయితే జెన్సీ ఈ క్రెడిట్ని తన ట్రాన్ కమ్యూనిటికీ చెందనదని అన్నారు.
ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో పోరాటాలు, తిరస్కరణలు ఎదుర్కొన్నానని అన్నారామె. ప్రస్తుతం ఆమె ట్రాన్స్జెండర్ విద్యార్థులు ఉచితంగా చదువుకునేలా చూస్తూ ప్రతి ఏడాది వారికోసం ఏడు నుంచి 12 సీట్లు రిజర్వ్ చేసేలా కాలేజీ యాజమాన్యంతో కలిసి పనిచేస్తున్నారు. సమాజ పక్షపాత వైఖరికి ఓటమితో తలవంచకుండా.. విద్యతో ధీటుగా సమాధానమిచ్చి ఆమోదించేలా చేసుకోవాలని జెన్సీ తన కథ ద్వారా చక్కటి సందేశం ఇచ్చింది కదూ..!.
(చదవండి: దంతాలతో కళాఖండాలు..! ఆమె టాలెట్కి ఫిదా అవ్వాల్సిందే)


