
చోరీ కేసుల్లో నిందితుల అరెస్ట్
ఏలూరు టౌన్: ఏలూరులో రాత్రివేళ ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న కేసులో ఇద్దరు నిందితులను, బైక్ల చోరీలకు పాల్పడుతున్న మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.11.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 17 మోటార్సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద మంగళవారం విలేకరుల సమావేశంలో ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ వివరాలు వెల్లడించారు. కై కలూరు మినీబైపాస్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను ఏలూరు వన్టౌన్ సీఐ సత్యనారాయణ బృందం అదుపులోకి తీసుకుని విచారించగా పలు ఇంటి చోరీల్లో బంగారు ఆభరణాలు అపహరించినట్లు నిర్ధారించారు. వారివద్ద నుంచి రూ.11.50 లక్షల విలువైన హారం, చంద్రహారం, మురుగులు, ఉంగరాలు, చెవిమాటీలు, నవరత్నాల దిద్దులు, బేబీ రింగులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో నిందితులైన గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పిల్లి సురేష్ అలియాస్ శివ, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన నాగళ్ళ ముత్తయ్య గుప్తాలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరిపై చోరీ, కొట్లాట, మోసం కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసును ఛేదించిన సీఐ సత్యనారాయణ, వన్టౌన్ ఎస్సై ఎస్కే మదీనా బాషా, ఎస్సై నాగబాబు, వన్టౌన్ ఏఎస్సై అహ్మద్, హెచ్సీ రమేష్, కానిస్టేబుళ్లు మోహన్, నాగార్జున, నాగరాజు, శేషుకుమార్, రుహుల్లా, సీసీఎస్ ఏఎస్సై గోపి, హెచ్సీ రమణ, పీసీ రజని ఉన్నారు. వీరిని ఎస్పీ అభినందించారు.
మోటార్సైకిళ్లు స్వాధీనం
ఏలూరు త్రీటౌన్ సీఐ వీ.కోటేశ్వరరావు, భీమడోలు సీఐ యూజే విల్సన్ వారి పోలీస్స్టేషన్ల పరిధిలో ప్రత్యేక నిఘా, తనిఖీలు చేపట్టి భారీగా చోరీకి గురైన మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు, ఎస్సై రాంబాబు, సిబ్బందితో నిఘా ఉంచి ఇద్దరు దొంగలను అరెస్ట్ చేశారు. వారిద్దరి నుంచీ 14 మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకోగా, వాటి విలువ సుమారు రూ.6.68 లక్షలుగా ఉంటుందని అంచనా. ఇక భీమడోలు సీఐ విల్సన్ ఆధ్వర్యంలో ద్వారకాతిరుమల ఎస్సై సుధీర్ తమ సిబ్బందితో తనిఖీలు చేసి 3 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1.40 లక్షలు ఉంటుందని అంచనా. కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన సయ్యద్ రజాక్, సయ్యద్ కరీముల్లాను అదుపులోకి తీసుకుని విచారించగా మోటారు సైకిళ్ల చోరీ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రతిభ చూపిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
ఇళ్ల దొంగతనాల్లో ఇద్దరు, బైక్ చోరీల్లో మరో ఇద్దరి అరెస్ట్
రూ.11.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 17 మోటార్సైకిళ్లు స్వాధీనం