
ఒప్పందాల అమలు ఎప్పుడు?
ఏలూరు (టూటౌన్): తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఈ నెల 12 నుంచి ఏలూరు కార్పొరేషన్, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, నూజివీడు మున్సిపాల్టీల పరిధిలో నిరసన దీక్షలు చేస్తున్నారు. జీతాలు పెంచాలని కోరుతూ ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన ఆందోళన 9వ రోజుకు చేరింది. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన లేదు. మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులకు జీతాలు జీవో నెంబర్ 36 ప్రకారం పెంచి అమలు చేయాలని, 17 రోజుల సమ్మె కాలపు ఒప్పందాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు రూ.21 వేలు ఇస్తూ ఇంజనీరింగ్ కార్మికులకు రూ.15 వేలు జీతాలు చెల్లించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2023 డిసెంబర్ నెలలో జరిగిన 17 రోజుల సమ్మె కాలపు ఒప్పందాలు అమలు చేయాలని కోరుతున్నారు. ఎక్స్గ్రేషియా ఏడు లక్షలకు పెంపు, రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.75,000, దహన సంస్కారాల ఖర్చులు 20,000, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచడం వంటి అంశాలు పెండింగ్ లోనే ఉన్నాయని, వాటిని తక్షణమే అమలు చేయాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు కోరుతున్నారు.
కార్మికుల ప్రధాన డిమాండ్లు
జీఓ నెంబర్ 36 ప్రకారం రూ.21,000, రూ.24,500 జీతాలు చెల్లించాలి
షరతులు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయాలి
రిటైర్మెంట్, చనిపోయినా, అనారోగ్యం పాలైన వారి స్థానంలో వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి
ఆప్కాస్ రద్దు చేస్తే ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలి
సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం, గ్రాట్యుటీ అమలు చేయాలి
చట్టబద్ధమైన సెలవులు అమలు చేయాలి.
ఏలూరు నగరంలో 250 మంది, నూజివీడు మున్సిపాలిటీలో 60, జంగారెడ్డిగూడెం 60,చింతలపూడి మున్సిపాలిటీలో 30 మంది ఇంజినీరింగ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు.
ఆందోళన బాట పట్టిన మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు
9 రోజులుగా దీక్షలు చేస్తున్నా స్పందించని కూటమి ప్రభుత్వం
ఏలూరు జిల్లాలో 400 మంది ఇంజినీరింగ్ కార్మికులు