
కూలి రేట్లు పెంచాలంటూ ధర్నా
ఏలూరు (టూటౌన్): నగరంలో కిరాణా షాపుల్లో లోడింగ్ అన్లోడింగ్ ట్రాన్స్పోర్ట్ కూలి రేట్లు పెంచాలని కోరుతూ శనివారం ధర్నా నిర్వహిం చారు. వన్టౌన్ గడియార స్తంభం వద్ద నుంచి హోల్ సేల్ షాపుల మీదుగా ప్రదర్శన నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చర్చలు జరపడానికి మర్చంట్ చాంబర్స్ అసోసియేషన్ నిరాకరించడం బాధాకర విషయమన్నారు. హమాలీ కార్మికుల కూలి రేట్ల పెంపుదల పోరాటానికి ఏఐటీయూసీ జిల్లా కమిటీ తరఫున పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నామన్నారు. ఇఫ్టూ సహాయ కార్యదర్శి యర్రా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ తక్షణం కూలీ రేట్ల పెంపుదల చర్చల తేదీని ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో ఎఐటీయుసీ జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే, ఏలూరు ఏరియా అధ్యక్షుడు కే కృష్ణ్ణమాచార్యులు, ఏఐటీయూసీ జిల్లా నాయకులు పి.కిషోర్, బి.జగన్నాథం, పోలా భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.
10 గంటల పని విధానం ఉపసంహరించాలి
ఏలూరు (టూటౌన్): రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 10 గంటల పని విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, రాత్రివేళల్లో మహిళలతో పని చేయించాలని నిబంధనను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయుసీ, ఐఎఫ్టీయు, సీఐటీయు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో శనివారం ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రాష్ట్రంలో వేగంగా అమలు చేస్తున్నారని, దానిలో భాగంగానే కార్మికుల 8 గంటల పనిని 10 గంటలకు పెంచుతూ జీవో జారీ చేసిందని గుర్తు చేశారు. మహిళలకు పట్టపగలే రక్షణ లేకుంటే, రాత్రి సమయాల్లో రక్షణ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. 8 గంటల పని విధానాన్ని ప్రపంచ కార్మిక వర్గం అనేక ప్రాణ త్యాగాలు చేసి సాధించుకుందని గుర్తు చేశారు. తక్షణమే 10 గంటల పని విధానం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు, జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబు, జిల్లా నాయకులు పల్లెం కిషోర్, కడుపు కన్నయ్య, బుగత జగన్నాథరావు, పోలా వెంకట భాస్కరరావు, ఐఎఫ్టీయు జిల్లా నాయకులు యర్రా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
డిప్లమో కోర్సుల దరఖాస్తుకు గడువు పెంపు
పెనుమంట్ర: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా నిర్వహించే వ్యవసాయ డిప్లమో కోర్సులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఈ నెల 30 వరకూ పొడిగించినట్లు మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ టి.శ్రీనివాస్ శనివారం ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను జూన్ 30 వరకూ పొడిగించినట్లు తెలిపారు. సందేహాలుంటే మారుటేరు కార్యాలయ పనివేళల్లో సంప్రదించవచ్చన్నారు.
సచివాలయ ఉద్యోగుల నిరసన
ఏలూరు (టూటౌన్): సచివాలయ ఉద్యోగులను ఆయా మున్సిపాల్టీలు, మండలాల పరిధిలోనే బదిలీలు చేయాలని కోరుతూ ఏలూరు కార్పొరేషన్ ఎదుట సచివాలయ ఉద్యోగులు శనివారం నిరసన తెలిపారు. సీనియారిటీ జాబితా ప్రకటన చేపట్టాలని, కేటగిరీల వారీగా ఉన్న సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో కార్పొరేషన్ పరిధిలోని 79 సచివాలయాల పరిఽధిలోని ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కమిషనర్కు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు.

కూలి రేట్లు పెంచాలంటూ ధర్నా

కూలి రేట్లు పెంచాలంటూ ధర్నా