మితవాదానికి మరో ఓటమి | Sakshi Editorial On Donald Trump | Sakshi
Sakshi News home page

మితవాదానికి మరో ఓటమి

May 6 2025 1:43 AM | Updated on May 6 2025 1:43 AM

Sakshi Editorial On Donald Trump

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ గమనించుకుంటున్నారో లేదో గానీ ప్రపంచంలో ఎక్కడ ఎన్ని కలు జరిగినా ఆయన చర్చనీయాంశం అవుతున్నారు. గెలుపోటముల్ని ప్రభావితం చేస్తున్నారు. ఇటీవల కెనడా ఎన్నికల్లో ట్రంప్‌ పట్ల మెతకగా వ్యవహరించిన కన్సర్వేటివ్‌లు ఓటమిపాలై, ఊహించని రీతిలో అధికార లిబరల్‌ పార్టీ గెలుపొందింది. ఇప్పుడు ఆస్ట్రేలియాలోనూ అదే జరిగింది. అచ్చం ట్రంప్‌ విధానాలనే అనుకరిస్తూ ఆస్ట్రేలియా ఎన్నికల్లో తిరుగులేని గెలుపు సాధించాలనుకున్న విపక్ష కన్సర్వేటివ్‌ పార్టీ అపజయాన్ని మూటకట్టుకోవటమే కాదు... ఆ పార్టీ గెలిస్తే ప్రధాని అవుతారనుకున్న నాయకుడు పీటర్‌ డటన్‌ సైతం ఓటమి పాలయ్యారు. 

2004 తర్వాత వరసగా రెండోసారి కూడా అధికారం నిలబెట్టుకున్న పార్టీగా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌ నేతృత్వంలోని లేబర్‌ పార్టీ చరిత్ర సృష్టించింది. ఇక సింగపూర్‌లో ఎప్పటిలా పద్నాలుగోసారి సైతం అధికార పీపుల్స్‌ యాక్షన్‌ పార్టీ (పీఏపీ) తిరిగి అధికారంలోకి రావటం వింతేమీ కాదుగానీ... ఆ పార్టీ నేత, ప్రధాని లారెన్స్‌ వాంగ్‌ ప్రచారసభల్లో ట్రంప్‌పై రణభేరి మోగించారు. అమెరికా విధించిన సుంకా లకు ప్రతీకార సుంకాలుంటాయని ప్రకటించారు. అసలు అమెరికాకు సింగపూర్‌ నుంచి ఎగుమతులు చేసేదే లేదని స్పష్టం చేశారు. 

97 స్థానాలున్న సభలో  ఆ పార్టీ 87 స్థానాలు గెల్చుకోవటం గతంలో కూడా జరిగినా ఈసారి వోటు శాతాన్ని సైతం 66.57కి పెంచుకుని చరిత్ర సృష్టించింది. ఇక రుమేనియాలో మాత్రం ట్రంప్‌ను తలకెత్తుకున్న తీవ్ర మితవాదపక్షం అలయెన్స్‌ ఫర్‌ ది యూనిటీ ఆఫ్‌ రుమేనియన్స్‌ (ఏయూఆర్‌) నాయకుడు జార్జి సైమన్‌  తొలి రౌండ్‌లో గెలుపొందారు. ఈ నెల 18న జరగబోయే రెండో రౌండ్‌ ఎన్నికల్లో సైతం ఆయనదే విజయమన్న అంచనాలున్నాయి. వచ్చే సెప్టెంబర్‌లో ఎన్నికలు జరగబోయే నార్వేలో కూడా ట్రంప్‌ ప్రభావం కనబడుతోంది. అక్కడి అధి కార లేబర్‌ పార్టీకి ఓటమి తప్పదని జనవరిలో వివిధ సర్వేలు ప్రకటించగా, ఆ మరుసటి నెలకల్లా అంతా మారిపోయింది. ఇప్పుడు లేబర్‌ పార్టీయే గెలుపుగుర్రంగా కనబడుతోంది.

కరోనా దాపురించినప్పటి నుంచీ ఆస్ట్రేలియా ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కాదు. ముఖ్యంగా మూడేళ్లుగా ఆ దేశంలో ఉత్పాదకత తీవ్రంగా దెబ్బతింది. ద్రవ్యోల్బణం పెరిగింది. దాన్ని తగ్గించటానికి ఆస్ట్రేలియా రిజర్వ్‌బ్యాంక్‌ 13 సార్లు వడ్డీరేట్లు పెంచింది. ఫలితం లేకపోగా అధిక ధరల కారణంగా కొనుగోళ్లు ఆగిపోయి గృహనిర్మాణ రంగం పడకేసింది. వీటన్నిటి వల్ల జీవన ప్రమాణాలు పడిపోయాయి. 

ఇవన్నీ చూసి తదుపరి ఎన్నికల్లో తమదే విజయమని కన్సర్వే టివ్‌ పార్టీ కలలుగంది. అమెరికాలో ట్రంప్‌కు పెరుగుతున్న మద్దతు చూసి అదే తరహా ప్రకటనలు చేసి ఆ పార్టీ నాయకుడు డటన్‌ మొదట్లో వోటర్ల మెప్పు పొందినమాట వాస్తవం. ప్రభుత్వ రంగంలో 40,000 ఉద్యోగాలు రద్దుచేస్తామని, వలసల విషయంలో కఠినంగా వుంటామని, ఉదార వాద విధానాలైన భిన్నత్వం, అందరినీ కలుపుకొనిపోవటం వగైరాలకు కాలం చెల్లిందని ఆయన పదే పదే ప్రకటించారు. 

ఆస్ట్రేలియా మొదటి నుంచీ అమెరికా మిత్ర దేశమే. అయినా ట్రంప్‌ ఏమాత్రం కనికరించలేదు. అందరితోపాటు ఆస్ట్రేలియాపైనా భారీయెత్తున సుంకాలు పెంచుతా మని ప్రకటించారు. ఇవింకా అమల్లోకి రాకపోయినా అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం కారణంగా అసలే అంతంతమాత్రంగా వున్న ఆర్థిక వ్యవస్థ మరింత అనిశ్చితిలోకి పోయింది. 

ఈ దశలో డటన్‌ తనకు ట్రంప్‌తో వున్న వ్యక్తిగత సాన్నిహిత్యం వల్ల ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థను సునాయాసంగా గట్టెక్కిస్తానని హామీ ఇచ్చారు. కానీ ట్రంప్‌ దూకుడు కారణంగా స్టాక్‌ మార్కెట్లన్నీ బోల్తా కొట్టడంతో డటన్‌కు దిక్కుతోచలేదు. దాంతో ట్రంప్‌ ప్రస్తావన మానుకున్నారు. కానీ అప్పటికే జరగా ల్సిన నష్టం జరిగిపోయింది. జనం లేబర్‌ పార్టీకే వోటేయాలన్న నిర్ణయానికొచ్చారు. 

సింగపూర్‌ సైతం ఆర్థిక అస్థిరతలో కొట్టుమిట్టాడుతోంది. అసలే వాణిజ్యం దెబ్బతిని వుండగా ట్రంప్‌ అధిక సుంకాల ప్రకటన మరింత దెబ్బ తీసింది. ఆస్ట్రేలియా మాదిరే ఆ దేశంలోనూ పౌరులకు సొంతిళ్లు సమకూర్చుకోవటం సమస్యగా మారింది. పెరిగిన ద్రవ్యోల్బణం, ఆర్థికమాంద్యం, ఉద్యో గాలు కోల్పోతామన్న భయాందోళనలు ప్రజల్ని వణికిస్తున్నాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అంచనాల కన్నా జీడీపీ చాలా తగ్గి 3.8 శాతానికొచ్చింది. 

వచ్చే త్రైమాసికంలో అది 2 శాతం మించక పోవచ్చు. ట్రంప్‌ సుంకాల బెదిరింపు సరేసరి. అందుకే ఈ అనిశ్చితిలో పాలకపక్షాన్నే మరోసారి గెలిపించటం ఉత్తమమన్న నిర్ణయానికొచ్చారు. కనుకనే పీఏపీ వోట్ల శాతం 61.2 నుంచి 65.67కి పెరి గింది. సింగపూర్‌ ఎన్నికల్ని విదేశీ మదుపుదార్లు, అంతర్జాతీయ మీడియా, వివిధ దేశాల ప్రభుత్వాలు శ్రద్ధగా గమనించాయి. ఈ అయిదేళ్లూ సింగపూర్‌ ఎదుర్కొన్న సమస్యలు అలాంటివి మరి.

ఏతావతా ఇప్పటికి ఒక్క రుమేనియా మినహాయించి ట్రంప్‌ను చూసి వాతలు పెట్టుకుంటున్న నాయకులంతా ఊహించని ఓటమితో ఖంగుతింటున్నారు. నిరుడంతా మితవాద పక్షాలు ఎక్కడి కక్కడ విజయం సాధించగా, ప్రస్తుతం ఆ పక్షాలకు ఎదురుగాలి వీస్తోంది. అయితే గెలిచిన పక్షాలు చుట్టుముడుతున్న ఆర్థిక సంక్షోభాలకు ఎదురీదటం, జనం మెప్పు పొందటం అంత సులభమేమీ కాదు. 

ప్రపంచంతోపాటే మనమూ అని ఈ సంక్షోభాల్ని సరిపెట్టుకునే పరిస్థితుల్లో వారు లేరు. కనుక సమస్యలకు దీటైన పరిష్కారాలు కనుగొనటానికి గద్దెనెక్కిన నాయకులు ప్రయత్నించాల్సి వుంది. వారి మాటెలావున్నా ప్రపంచమంతటా తన కారణంగా మితవాద పక్షాలు బోల్తా కొట్టడాన్ని చూసైనా ట్రంప్‌ తన విధానాలను మార్చుకుంటారా, లేదా అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement