● చంద్రబాబుపై వైఎస్సార్ సీపీ
జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన ధ్వజం
● మునికూడలిలో మాజీ సర్పంచ్తో
పాటు 70 మంది పార్టీలో చేరిక
సీతానగరం: ఎన్నికల్లో రైతుల రుణమాఫీ చేస్తానని నమ్మించి 2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు... కోటయ్య కమిటీ వేసి కోత కోశారని, ఈ దఫా కూడా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బుధవారం మండలం మునికూడలిలో మాజీ సర్పంచ్ బండి హరిబాబుతో పాటు వివిధ పార్టీల నుంచి వచ్చిన 30 మందికి ఆయనతో పాటు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వైఎస్సార్ సీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వేణు మాట్లాడుతూ నిబద్ధత కలిగిన వ్యక్తులు పార్టీలోకి రావడం శుభ పరిణామని తెలిపారు. ప్రజల కోసం రాజకీయం చేసే జక్కంపూడి రాజాను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కార్యకర్తలను కోరారు. వైఎస్సార్ సీపీ పాలనలో ఉచిత విద్యుత్, జలయజ్ఞంతో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, చంద్రబాబు పాలనలో ధరలు పెరిగి ప్రజా వ్యతిరేకత పెరిగిందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెపుతారని వేణు హెచ్చరించారు.
అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించారు :
మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
గడచిన రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అభివృద్ధిని సంక్షేమాన్ని విస్మరించిందని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. నాలుగు లైన్ల స్టేట్ హైవే తన హయాంలో పూర్తి చేయడం సంతృప్తి ఇచ్చిందన్నారు. బొబ్బిలంకలో రూ.38 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించామన్నారు. ఈ ప్రభుత్వ రెండున్నరేళ్లలో దానిని పూర్తిచేయలేకపోయారని అన్నారు. రఘుదేవపురంలోని 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి తమ హయాంలో శంకుస్థాపన చేస్తే, దానిని పూర్తి చేయడానికి నేటికీ కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం లేదన్నారు. 100 కోట్ల వ్యయంతో రివర్స్ పంపింగ్ స్కీం ద్వారా 25 వేల ఎకరాల పంట భూమిని ముంపు బారి నుంచి రక్షించాలని ప్రయత్నించామన్నారు. 230 కోట్లతో గోదావరి జలాలను శుద్ధిచేసే తాగునీటి ప్రాజెక్టును తీసుకువచ్చామన్నారు. నియోజకవర్గంలో 20వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు. ఈ ప్రభుత్వ కాలంలో ఎవరికీ సెంటు భూమి కానీ, పింఛన్లు కానీ ఇవ్వలేదన్నారు. కరోనా విపత్తులో సైతం అన్ని పథకాలను కొనసాగించిన ఘనత మాజీ సీఎం జగన్దేనన్నారు. నియోజకవర్గంలో ఇసుక, మట్టి దోపిడీతో పాటు రేషన్ బియ్యాన్ని అమ్ముకునే స్థాయికి స్థానిక ఎమ్మెల్యే దిగజారారన్నారు. రానున్న రోజుల్లో హరిబాబుకు సముచితస్థానం కల్పిస్తామన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక పురుషోత్తపట్నం నుంచి బొబ్బిలంక వరకు ఏటిగట్టుకు అవసరమైన ప్రాంతాల్లో రక్షణ గోడ నిర్మింస్తామని రాజా ప్రకటించారు. పార్టీ మండల కన్వీనర్ గంటా శ్రీనివాస్, కో కన్వీనర్ కరుటూరి శ్రీహరిబాబు, పెందుర్తి దేవదాసు, ముత్యాలు, కవల కృష్ణమూర్తి, అంబటి రాజు, కొంచ చంద్రభాస్కర్, పిచ్చుకుల విజయ్ కుమార్లు ప్రసంగించారు. అనంతరం హరిబాబుతో పాటుగా బండి శ్రీను, మల్లి శ్రీను, బండి బ్రహ్మాజీ, బండి బుజ్జి, పాత్రగడ వెంకటలక్ష్మి, గంగరాజుల నాగేశ్వరరావు, పాత్రగడ రామారావు, రేలంగి వెంకన్న, ఇండుగుమిల్లి రాజారావు, కొల్లి అబ్బురావులతోపాటుగా మరో 40 మందికి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుర్రాల జ్యోత్స్న, పార్టీ నాయకులు వాలంటీర్ల విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరి పెదపాటి డాక్టర్బాబు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి వలవల వెంకట్రాజు, చల్లమళ్ల సుజీరాజు, ఆకుల సత్యనారాయణ, కవల దుర్గం, ఎల్ఐసీ ఏసు తదితరులు పాల్గొన్నారు.


