డీజీపీ హరీష్కుమార్ గుప్తా
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): పుష్కరాల నిర్వహణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు వసతులు కల్పించాలని డీజీపీ హరీష్కుమార్ గుప్తా అన్నారు. శనివారం రాజమహేంద్రవరం మంజీరాహోటల్లో రానున్న పుష్కరాల ఏర్పాట్లపై పోలీసు అధికారులు, ఇతర శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. జిల్లా ఎస్పీ డి.నరసింహకిశోర్ జిల్లాలో పుష్కర పనులను డీజీపీకి వివరించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ హౌసింగ్ బోర్డ్ అధికారులతో సమన్వయం చేసుకుని 2027 ఫిబ్రవరిలోపు పోలీస్ కమాండ్ కంట్రోల్ బిల్డింగ్ నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మల్టిపుల్ పుష్కర్ జాయింట్ యాక్షన్ టీమ్స్ ఏర్పాటు చేసి, అన్ని శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్లు, ఫీల్డ్ సిబ్బంది ద్వారా రియల్ టైమ్ సమాచారాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరేలా కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. పుష్కరాలు సమయంలో స్థానిక ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలన్నారు. పుష్కర పనులన్నీ నిర్ణీత గడువులో పూర్తయ్యేలా జాయింట్ క్యాలెండర్ రూపొందించుకోవాలన్నారు. వలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. పుష్కరాలు జరిగే మిగిలిన జిల్లాల్లోనూ ఇవే సూచనలు పాటిస్తూ ముందుకు సాగాలని ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో ఏలూరు రేంజ్ ఐజి జీవీజీ అశోక్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు.


